కరోనా ముసుగులో కోట్లు దండుకున్నారు
ABN , First Publish Date - 2020-05-31T11:41:10+05:30 IST
కరోనా నివారణ చర్యల పేరుతో వైసీపీ నేతలు కోట్లుదండుకున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ
గుంటూరు, మే 30(ఆంధ్రజ్యోతి): కరోనా నివారణ చర్యల పేరుతో వైసీపీ నేతలు కోట్లుదండుకున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. పార్టీ మన్నవ సుబ్బారావుతో కలిసి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం రేట్లు 95శాతం, ఇసుక రేటు 300శాతం, విద్యుత్ ఛార్జీలు 300శాతం పెంచడమేనా సంవత్సరకాలంలో సీఎం జగన్ సాధించిన విజయాలు అని నిలదీశారు. రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం మీరు చేసిన ఘనకార్యం కాదా అని ప్రశ్నించారు. రూ.87వేల కోట్లు అప్పులు చేశారని ధ్వజమెత్తారు.
ఏడాదిలోనే ధరలు పెంచడ ద్వారా రూ.50వేల కోట్ల భారం ప్రజలపై మోపారని ఆరోపించారు. ఒక్క మద్యంలోనే జే ట్యాక్స్ ద్వారా రూ.25వేల కోట్లు దండుకుంటున్నారన్నారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియాలుగా వైసీపీ నేతలు తయారయ్యారన్నారు. ప్రశ్నించిన ప్రజలపై, మీడియా సంస్థలపై, ఉద్యోగులపై దాడులు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో ఎదురు దెబ్బలు తగులుతున్నా సిగ్గులేకుండా రైతు భరోసా కేంద్రాలకు వైసీపీ రంగులు వేసుకుంటున్నారని ఆరోపించారు.