కరోనా చిదిమిన బతుకులు!

ABN , First Publish Date - 2021-05-08T08:57:56+05:30 IST

భార్యాభర్తలకు కరోనా సోకడంతో.. వైద్యం చేయించుకునే స్థోమత లేక బలవన్మరణానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో భార్య ప్రాణాలు కోల్పోగా..

కరోనా చిదిమిన బతుకులు!

  • బలవన్మరణానికి భార్యాభర్తల యత్నం
  • భార్య చేతిని కోసిన భర్త..
  • చావు తప్పించుకుని హంతకుడైన భర్త
  • అనాథలుగా మిగిలిన బిడ్డలు


కావలి రూరల్‌, మే 7: భార్యాభర్తలకు కరోనా సోకడంతో.. వైద్యం చేయించుకునే స్థోమత లేక బలవన్మరణానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో భార్య ప్రాణాలు కోల్పోగా.. భర్తకు ప్రాణాపాయం తప్పింది. అయితే భార్య మరణానికి తానే కారణమంటూ ఆ వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. నెల్లూరు జిల్లా జలదంకికి చెందిన పెసల మాల్యాద్రి శ్రీనివాసులు, అనురాధ (30) దంపతులది నిరుపేద కుటుంబం. జీవనోపాధి కోసం 10 ఏళ్ల క్రితం కావలికి వచ్చారు. వారికి 11 ఏళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. గత నెల 25న ఇద్దరికీ కరోనా సోకింది. దీంతో పిల్లలను తెలిసిన వారింటికి పంపి వారు ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అనురాధకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. భర్తకు చెప్పడంతో ఆయన 108, 104 సేవల కోసం ప్రయత్నించాడు. వారు స్పందించలేదు. ఇటీవల కావలిలో ఆక్సిజన్‌ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయరనే విషయాలు చూసి తమకూ అదే పరిస్థితి తప్పదని భావించారు. కరోనా వైద్యం ఖర్చుతో కూడుకున్నదని, ఇది తమ ఆర్థిక స్థోమతకి తగదనుకున్నారు. ఇక ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయించుకున్నారు. గురువారంరాత్రి మాల్యాద్రి భార్య చేయి మణికట్టును కత్తితో కోశాడు. అనంతరం మద్యం సేవించి తాను కూడా ఎడమ చేతిని కోసుకుని షాపు వద్దకు వెళ్లి నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా భార్య విగత జీవిగా పడిఉంది. దీంతో మాల్యాద్రి పోలీసులకు లొంగిపోయాడు. 

Updated Date - 2021-05-08T08:57:56+05:30 IST