ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న జిల్లావాసులు
ABN , First Publish Date - 2020-04-02T10:32:54+05:30 IST
కరోనా మహమ్మారి అనంతను హడలెత్తిస్తోంది. ఇంతవరకూ మనకు పెద్ద ప్రమాదం ఉండదనుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉంటూ వచ్చారు.
పాజిటివ్ కేసులతో పెరిగిన టెన్షన్
పరీక్షలకు అనుమానితులు పరుగులు
ఆస్పత్రిలోని కరోనా ఓపీ కిటకిట
జిల్లాలో 118 మందికి శాంపిళ్లు
అనంతపురం వైద్యం, ఏప్రిల్1 : కరోనా మహమ్మారి అనంతను హడలెత్తిస్తోంది. ఇంతవరకూ మనకు పెద్ద ప్రమాదం ఉండదనుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉంటూ వచ్చారు. అయితే ఢిల్లీలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో జిల్లావాసులు పాల్గొనడం, వారిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. ఢిల్లీకి ప్రార్థనలకు వెళ్లిన వారిలో ఇతర జిల్లాల వారికి కూడా కరోనా పాజిటివ్లు రావడంతో రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో గుట్టుగా ఉంటున్న అనుమానితులు పరీక్షలు చేయించుకోవడానికి అనేక మంది జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కరోనా ఓపీ విభాగానికి తరలివస్తున్నారు. బుధవారం ఉద యం నుంచి ఆ ఓపీ కరోనా అనుమానితులతో కిటకిటలా డింది. వైద్యులు వారందరికీ పరీక్షలు చేసి, వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్ను తీసుకుని ల్యాబ్కు పంపించారు.
జిల్లాలో 118 మందికి నిర్ధారణ పరీక్షలు
జిల్లాలో కరోనా అనుమానితులు పెరుగుతున్నారు. అధి కారుల ఒత్తిడితో కొందరు, స్వచ్ఛందంగా మరికొందరు పరీక్షలకు ముందుకు వస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకూ 118 మంది అను మానితులకు జిల్లా ల్యాబ్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో అనంతపురం ఆస్పత్రి నుంచి 109 మం దికి, హిందూపురం ఆస్పత్రి నుంచి 9 మందికి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ స్వర్ణలత తెలిపారు. అలాగే కర్నూలు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున శాంపిల్స్ జిల్లా ల్యాబ్కు వస్తున్నాయి. కర్నూలు నుంచి 79, నంద్యాల నుంచి 2 శాంపిల్స్ చొప్పున మొత్తం ఆ జిల్లా నుంచి 81 కరోనా అనుమానితుల శాంపి ల్స్ వచ్చాయి. ఇలా బుధవారం ఒక్కరోజే అనంతపురం, కర్నూలు జిల్లాలు కలిపి 199 మంది శాంపిల్స్ను నిర్ధారణ పరీక్షలు చేశారు.
క్వారంటైన్లకు అనుమానితుల తరలింపు
కరోనా అనుమానితులపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇంతవరకూ ఇళ్లవద్దనే బయటకు రా కుండా ఉండాలని ఆంక్షలు పెడుతూ వచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు సీరియస్గా మారిపోవడంతో అధికారులు అనుమానితులను ఇళ్లకు పంపించకుండా క్వారంటైన్లకు తరలిస్తున్నారు. బుధవారం 109 మంది అనుమానితుల ను క్వారంటైన్లలో ఉంచారు.
వెంటిలేటర్ వార్డుకు ‘పురం’ వ్యక్తి తరలింపు
హిందూపురం ప్రాంతం నుంచి ఓ వ్యక్తి కరోనా అను మానంతో జిల్లా ఆస్పత్రి ఓపీకి వచ్చారు. ఇక్కడ వైద్యులు ఆ వ్యక్తికి పూర్తిస్థాయిలో పరీక్షలు చేశారు. తొలుత చెస్ట్ సమస్య అనుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి సీరియస్గా మారింది. దీంతో ఆస్పత్రిలోని వెంటిలేటర్ వార్డుకు తర లించి చికిత్సలు అందిస్తున్నారు.
ట్రామా సెంటర్లో 25 వెంటిలేటర్లు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా ఆస్పతిల్రో ఏర్పాట్లపై సూపరింటెండెంట్ రామస్వామినాయక్, ఆర్ఎం ఓలు, ఇతర వైద్యాధికారులు దృష్టి పెట్టారు. కరోనా పాజి టివ్ కేసుల పరిస్థితి విషమిస్తే అత్యవసరంగా వెంటి లేటర్లతో చికిత్స అందించాల్సి వస్తోంది. అలాంటి బాధి తుల కోసం ఆస్పత్రిలోని ట్రామాసెంటర్లో 25 బెడ్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క బెడ్డుకు ఒక్కో వెంటిలేటర్ ఉండేలా సిద్ధం చేశారు.