కరోనా కొత్త లక్షణాలివే!

ABN , First Publish Date - 2020-07-04T07:17:06+05:30 IST

రోనా వైరస్‌ లక్షణాల్లో కొత్త అంశాలు వచ్చి చేరాయి. తాజాగా ఒళ్లు నొప్పులు వచ్చినా, విరేచనాలు అయినా కరోనా వైర్‌సగా అనుమానించాల్సిందేనంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రధాన లక్షణాలను

కరోనా కొత్త లక్షణాలివే!

న్యూఢిల్లీ, జూలై 3: కరోనా వైరస్‌ లక్షణాల్లో కొత్త అంశాలు వచ్చి చేరాయి. తాజాగా ఒళ్లు నొప్పులు వచ్చినా, విరేచనాలు అయినా కరోనా వైర్‌సగా అనుమానించాల్సిందేనంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రధాన లక్షణాలను పరిశీలిస్తే.... 

దగ్గు: గంటకు మించి ఆగకుండా దగ్గు వస్తే అనుమానించాలి. ఇలా రోజుకు 3 సార్లు వచ్చిందంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిందే. స్వల్పంగా దగ్గు ఉండి పాజిటివ్‌లు అయిన వారూ ఉన్నారు. 

జ్వరం: కరోనా రోగికి సాధారణంగా జ్వరం వస్తుంది. 100.6 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు ఉంటుంది. 98.6 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు సాధారణ శరీర ఉష్ణోగ్రతగానే భావిస్తారు. 

తీవ్ర నీరసం: కొవిడ్‌ వచ్చిందంటే బాగా అలసిపోతారు. నీరసంగా అనిపిస్తుంది.   

వాసన: కొవిడ్‌ రోగుల్లో చాలామందికి వాసన తెలియడం లేదు. ఇలాంటి వారిలో ఎక్కువ మందికి పాజిటివ్‌ వస్తోంది.

రుచి: రోగుల్లో కొంతమందికి రుచీ తెలియడం లేదు. 

వణుకుడు: చలిపెడుతూ వణుకుడు వస్తుంది. సామాన్యంగా ఇలా రావడం దేహంలోకి వైరల్‌ ఇన్ఫెక్షన్‌ ప్రవేశించడానికి సంకేతం. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం తోడైతే కరోనాగా అనుమానించాలి.

కండరాల నొప్పి: కండరాల నొప్పి కారణంగా దైనందిన విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఉంటే దాన్ని కొవిడ్‌గా అనుమానించాల్సిందే. 

శ్వాస ఇబ్బంది: శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడటం, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోవడం. 

గొంతునొప్పి:  గొంతు పచ్చి చేసినట్లుగా ఉండటం.  

విరేచనాలు: విరేచనాలు ఎక్కువగా అవుతుంటే కూడా కొవిడ్‌గా అనుమానించాలి.   

ఇతర లక్షణాలు: కొద్ది మందిలో వాంతులు, చర్మంపై దద్దుర్లు, వికారం, నడుం నొప్పి సమస్యలు కనిపిస్తున్నాయి. 

ఎన్నాళ్లకు లక్షణాలు: కొవిడ్‌ సోకిన 5 రోజుల తర్వాత కానీ లక్షణాలు బయటపడవు. కొంతమందికి గరిష్ఠంగా 14 రోజుల్లో బయట పడతాయి. కొంతమందికి కోలుకునే వరకూ లక్షణాలే ఉండవు. 

ఎలా నిలువరించాలి: ముక్కు, నోరును ముట్టుకునే అలవాటు మానాలి. కొవిడ్‌ రోగి పీల్చిన గాలే పీలిస్తే మనకు కరోనా వచ్చే అవకాశం ఎక్కువ. శుభ్రంగా ఉందన్న నమ్మకం లేని చోట చేయి పెడితే అది నోటికి, ముక్కుకి తగలకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా మనకు నమ్మకంలేని చోట చేయి పెట్టినపుడల్లా చేతులు కడుక్కోవాల్సిందే. 

బహిరంగంగా చీదొద్దు: దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా టిష్యూ పేపర్లు వాడండి. వాటిని నోటికి, ముక్కుకు అడ్డం పెట్టుకొని, పని కాగానే జాగ్రత్తగా పారేయాలి.   

కరోనా వస్తే తీవ్రత తెలుసుకొనేదెలా?: సైటోకైన్‌ స్టార్మ్‌ పరీక్ష చేయించాలి. ఊపిరితిత్తుల్లో వాపు తీవ్రత అధికంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థ గందరగోళంలో పడితే ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి రోగి ప్రాణాలకు ముప్పు తీవ్రత ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు.

Updated Date - 2020-07-04T07:17:06+05:30 IST