ఈ కిట్తో 30 నిముషాల్లో ‘కరోనా’ నిర్ధారణ
ABN , First Publish Date - 2020-04-10T14:16:58+05:30 IST
భారత వైద్య పరిశోధన కౌన్సిల్ (ఐసీఎంఆర్) ఈ పరికరానికిగాను
- అందుబాటులోకి రానున్న ‘రాపిడ్ టెస్ట్ కిట్’
చెన్నై : ‘కరోనా’ వైరస్ను త్వరితంగా పరీక్షించే ‘రాపిడ్ టెస్ట్ కిట్’ పరికరం ఒకటి, రెండ్రోజుల్లో అందుబాటులోకి రానుంది. భారత వైద్య పరిశోధన కౌన్సిల్ (ఐసీఎంఆర్) ఈ పరికరానికిగాను అనుమతిని రాష్ట్రప్రభుత్వాలకు జారీ చేసింది. ఈ పరికరంతో 30 నిముషాల్లో ‘కొవిడ్-19’ వైరస్ సోకింది, లేనిది నిర్ధారణ కానుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉన్నవారి ‘గల్ల’ను తీసుకొని పరీక్షిస్తుండగా, ఈ పరికరం ద్వారా రక్తం తీసుకొని పరీక్ష చేయనున్నారు.
ఇది సురక్షితమైనదని, పాజిటివ్ కరోనా బాధితులను కూడా దీని ద్వారా పరీక్షించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. చైనా నుంచి 20 లక్షల నుంచి ఒక కోటి వరకు దిగుమతి చేయనున్నామని, అంతర్జాతీయ మార్కెట్లో ఒక పరికరం ధర రూ.950 నుంచి రూ.1,000 ఉంటుందని, మన దేశంలో తొలివిడతగా 10 లక్షల పరికరాలు కొనుగోలు చేసేందుకు రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్రంలో లక్ష పరికరాలకు ఆర్డర్లు ఇవ్వగా శుక్రవారం నుంచి ఈ పరికరాలు అందుబాటులోకి రానున్నాయని వైద్యులు తెలిపారు.