30 మందికి అక్కడ పాజిటివ్... ఇక్కడ నెగిటివ్... దర్యాప్తునకు అధికారులు ఆదేశం

ABN , First Publish Date - 2020-09-24T17:11:56+05:30 IST

యూపీలోని కాన్పూర్‌లోగల ఒక పాథాలజీ ల్యాబ్ కరోనా నెగిటివ్ ఉన్నవారిని కారోనా పాజిటివ్‌గా చూపించిన ఉదంతం కలకలం రేపింది. ఈ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న...

30 మందికి అక్కడ పాజిటివ్... ఇక్కడ నెగిటివ్... దర్యాప్తునకు అధికారులు ఆదేశం

కాన్పూర్: యూపీలోని కాన్పూర్‌లోగల ఒక పాథాలజీ ల్యాబ్ కరోనా నెగిటివ్ ఉన్నవారిని కారోనా పాజిటివ్‌గా చూపించిన ఉదంతం కలకలం రేపింది. ఈ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న 30 మందికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అయితే వీరంతా తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ ఉదంతంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే ఒక బాధితుని ఫిర్యాదు మేరకు డీఎం అలోక్ తివారి, సీఎంఓ డాక్టర్ అనిల్ కుమార్ మిశ్రాలు స్వరూప్ నగర్‌లోని ఒక పాథాలజీ ల్యాబ్‌పై దాడి చేశారు. అధికారులను కలిసిన ఆ బాధితుడు తాను ఈ ల్యాబ్‌లో కరోనా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చిందని, మరో ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని ఫిర్యాదు చేశాడు. 



దీంతో డీఎం స్వయంగా రంగంలోకి దిగి ఆ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న కొంతమంది బాధితుల ఫోను నంబర్లు, చిరునామాలు తీసుకుని పరిశీలించగా అవి తప్పుడు సమాచారంతో కూడుకున్నవని తేలింది. దీనికితోడు ఆ ల్యాబ్‌లో మరిన్ని అవకతవకలు జరగుతున్నాయని వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఈ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు చేయించుకుని, పాజిటివ్ వచ్చిన కొంతమందికి తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా వారికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మరికొంతమంది బాధితుల రిపోర్టు ఇంకా రావలసివుంది. దీంతో డీఎం ఈ ల్యాబ్‌లో జరిగిన అవకతవకలపై వెంటనే దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-09-24T17:11:56+05:30 IST