నిరంతరాయంగా కోవిడ్-19 పరీక్షలు
ABN , First Publish Date - 2020-08-09T07:44:48+05:30 IST
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 నిర్దారణ పరీక్షలు నిరంతరాయంగా జరుగుతున్నాయని..
- నిర్ధారణపై అసత్యప్రచారం చేస్తే చర్యలు
- ఖమ్మం కలెక్టర్ కర్ణన్
ఖమ్మంటౌన్, ఆగస్టు8: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 నిర్దారణ పరీక్షలు నిరంతరాయంగా జరుగుతున్నాయని, ఈ పరీక్షలపై అసత్య, దుష్ప్రచారాలు చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ. కర్ణన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ట్రూనాట్ పరీక్ష నిర్ధారణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 50కంటే అధికంగా ట్రూనాట్ పరీక్షలను నిర్వహిస్తున్నారన్నారు. అలాగే 200 నుంచి 250 వరకు ర్యాపిడ్ టెస్ట్లను నిర్వహిస్తున్నారని వివరించారు. ర్యాపిడ్టెస్ట్ల్లో నెగిటివ్ వచ్చి కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ట్రూనాట్ పరీక్ష చేయటం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్-19 నిర్ధారణకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితో పాటు ప్రతి పీహెచ్సీ, అర్బన్ హెల్త్. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రతిరోజు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారన్నారు. కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్. బీ.మాలతి ఉన్నారు.