కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని కరోనా పరీక్షలు చేశారంటే..
ABN , First Publish Date - 2020-07-10T17:46:43+05:30 IST
ఇప్పటివరకు జిల్లాలో లక్షా26వేల104 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ ఇంతియాజ్ గురువారం విడుదల చేసిన బులెటిన్లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంపిల్స్
కృష్ణా జిల్లాలో లక్షా26వేల104 కరోనా పరీక్షలు
రోజూ 5,500 పరీక్షలు ఫ 24 గంటల్లోనే ఫలితాలు : కలెక్టర్
విజయవాడ సిటీ : ఇప్పటివరకు జిల్లాలో లక్షా26వేల104 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ ఇంతియాజ్ గురువారం విడుదల చేసిన బులెటిన్లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంపిల్స్ సేకరించిన 24 గంటల్లోనే ఫలితాలను అందిస్తున్నామన్నారు. విజయవాడ, మచిలీపట్నం, గన్నవరం, నూజివీడు, జగ్గయ్యపేట, సిద్ధార్థ మెడికల్ కళాశాలల్లోని ల్యాబ్ల ద్వారా రోజూ 5,500 పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటితో పాటు అపోలో, మణిపాల్ ప్రైవేట్ ల్యాబ్ల్లో కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఐమాస్క్ బస్సులు, మొబైల్ బృందాల ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్నామన్నారు. నగరంలోని బిషప్ అజరయ్య హైస్కూల్లో ఏర్పాటుచేసిన ట్రైఏజ్ సెంటర్ ద్వారా మైల్డ్ కేసులు, పాజిటివ్ కేసులకు సంబంధించి హోం ఐసోలేషన్ వెళ్లేవారికి అనుమతులు మంజూరు చేస్తారన్నారు. ఈసీజీ, ఎక్స్రే, రక్త పరీక్షలు నిర్వహించి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని కొవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేస్తారని, మిగిలిన వారిని హోం ఐసోలేషన్కు అనుమతిస్తామని చెప్పారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి ఆయా ఏరియా వైద్యులు పరీక్షించి ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య సహాయం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
24 గంటల్లో వ్యాధి నిర్ధారణ ఫలితాలు వెల్లడించాలి
కరోనా నిర్ధారణకు సేకరించే శాంపిల్స్ ఫలితాలు 24 గంటల్లోనే వచ్చేలా సంబంధిత వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. నగరంలో కరోనా నియంత్రణ చర్యలపై వీఎంసీ కమినర్ వి.ప్రసన్న వెంకటేష్తో కలిసి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.