కరోనా వేళ బదిలీలా!?
ABN , First Publish Date - 2020-08-13T11:02:57+05:30 IST
ఓ వైపు జిల్లాలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుంటే అధికారులను బదిలీలు చేయడం దురదృష్టకరమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చం
కోవిడ్ ఆసుపత్రుల్లో పడకల లెక్కల్లో తేడా!
అడ్మిట్ కావాలంటే 2 రోజుల సమయం
టీడీపీ నేత సోమిరెడ్డి
నెల్లూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : ఓ వైపు జిల్లాలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుంటే అధికారులను బదిలీలు చేయడం దురదృష్టకరమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. బుధవారం నెల్లూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఆయన ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. చెప్పింది చేయలేదని కలెక్టర్ శేషగిరిబాబును, మంచి అధికారి అయిన జేసీ, ఇతర అధికారులను బదిలీ చేయడం పాలనాపరంగా తప్పుడు సంకేతాలిస్తున్నాయని అన్నారు.
ఇక జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల్లో వందల పడకలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని, కానీ ఒక పాజిటివ్ రోగి ఆసుపత్రిలో అడ్మిట్ కావాలంటే రెండు రోజులు పడుతోందని విమర్శించారు. ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోలేదని మనుబోలు హైస్కూల్ హెచ్ఎం నడిరోడ్డుపై విలపించే పరిస్థితి రావడం దురదృష్టకరమని, ఆయన ఆసుపత్రిలోనే మృతి చెందడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నా కొత్తగా వచ్చిన కలెక్టర్ చక్రధర్బాబుపై నమ్మకం ఉందని, ఆసుపత్రుల్లోని సౌకర్యాలు, వైద్య సేవల్లోని లోపాలను సరిదిద్దుతారని ఆశిస్తున్నామని సోమిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు, డిశ్చార్జి అయిన వారికి రూ.2 వేలు ఇస్తామన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తాళ్లపాక రమే్షరెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్, జెడ్.శివప్రసాద్, తాళ్లపాక అనురాధ, వేలూరు రంగారావు తదితరులు పాల్గొన్నారు.