ఈ సంక్షోభం.. ఒక అవకాశం
ABN , First Publish Date - 2020-06-05T07:26:03+05:30 IST
భారత్, ఆస్ట్రేలియా దేశాల నడుమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఏడు కీలక ఒప్పందాలపై ఇరుదేశాలూ గురువారం సంతకాలు చేశాయి. వాటిలో కీలకమైనది.. ‘ద మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎంఎల్ఎ్సఏ)’ అనే ఒప్పందం...
- ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ ఆన్లైన్ భేటీ
- పరస్పర రక్షణ సహకారంపై ఎంఎల్ఎస్ఏ సహా
- ఏడు కీలక ఒప్పందాలపై ఇరుదేశాల సంతకాలు
- పలు అంశాలపై కలిసి పనిచేసేందుకు సంసిద్ధత
- ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా మద్దతు
- భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి కూడా!
న్యూఢిల్లీ, జూన్ 4: భారత్, ఆస్ట్రేలియా దేశాల నడుమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఏడు కీలక ఒప్పందాలపై ఇరుదేశాలూ గురువారం సంతకాలు చేశాయి. వాటిలో కీలకమైనది.. ‘ద మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎంఎల్ఎ్సఏ)’ అనే ఒప్పందం. దాని ప్రకారం ఇరుదేశాల సైన్యాలూ ఒకరి సైనిక స్థావరాలను మరొకరు మరమ్మతులు, సరుకుల భర్తీ వంటివాటికి వినియోగించుకోవచ్చు. గతంలో అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ దేశాలతో కూడా భారతదేశం ఇలాంటి ఒప్పందాన్నే కుదుర్చుకుంది. అలాగే, దక్షిణ చైనా సముద్రంలో చైనా తన సైనిక ప్రాబల్యాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అన్ని దేశాల సార్వభౌమాధికారాన్నీ గౌరవించేలా రూపొందించిన రూల్స్ బేస్డ్ మారిటైమ్ ఆర్డర్కు మద్దతిచ్చే ఒప్పందంపైన, సైబర్, సైబర్ ఎనేబుల్డ్ క్రిటికల్ టెక్నాలజీ, గనులు-ఖనిజాలు, సైనిక సాంకేతికత, వృత్తి విద్య, నీటి వనరుల నిర్వహణ ఒప్పందాలపైనా సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందు భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఆన్లైన్లో చర్చలు (వర్చువల్ సమ్మిట్) జరిపారు. అనంతరం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్-ఆస్ట్రేలియా డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డీటీఏఏ), ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ), ఉగ్రవాదం పై పోరు వంటి అంశాలపై చర్చించినట్టు అందులో తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సత్వరం సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరుదేశాలూ పిలుపునిచ్చా యి. ఇంధన, పర్యావరణ రంగాల్లో సంబంధాల ను బలోపేతం చేసుకోవాలని.. పర్యావరణ మా ర్పు, కరోనాపై పోరు తదితర అంశాలపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. కాగా.. కొవిడ్-19 కారణంగా ఏర్పడిన సామాజిక, ఆర్థిక దుష్ప్రభావాల నుంచి బయటకు రావడానికి సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆస్ట్రేలియా ప్రధానితో భేటీ లో మోదీ అభిప్రాయపడ్డారు. తమ (భారత) ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా చూస్తోందని.. ఈ క్రమంలోనే అన్ని రంగాలకూ మేలు చేసేలా సమగ్రమైన సంస్కరణల ప్రకియ్రను ప్రారంభించామని మోదీ తెలిపారు. ప్రధాని ఇలా ఒక దేశ ప్రధానితో ఆన్లైన్లో సమావేశం కావడం ఇదే తొలిసారి. దీన్ని ఆయన భారత్-ఆస్ట్రేలియా మధ్య కొత్త తరహా భాగస్వామ్యంగా అభివర్ణించారు. మోరిసన్తో భేటీ అద్భుతంగా జరిగిందని ప్రధాని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో భారతీయులను.. మరీ ముఖ్యంగా విద్యార్థులను కరోనా సంక్షోభ వేళలో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని మోరిసన్ను మోదీ కొనియాడారు. భారత్-ఆస్ట్రేలియా బంధం బలోపేతం కావడం ఇరుదేశాలకే కాక, ఇండోపసిఫిక్ ప్రాంతానికి, ప్రపంచానికి ముఖ్యమ ని మోదీ వ్యాఖ్యానించా రు. ఇక ఇండో-పసిఫిక్ ప్రాం తంలో సుస్థిరతకు భారత్ కీలకపాత్ర పోషిస్తోందని మోరిసన్ అన్నారు.
బలమైన మద్దతు..
కీలకమైన ‘అణు సరఫరా బృందం (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్)’లో భారత్ సభ్యత్వానికి బలమైన మద్దతు తెలుపుతున్నామని ఆస్ట్రేలియా ప్రకటించింది. గురువారంనాడు ఇరు దేశాల ప్రధానులూ ఆన్లైన్లో చర్చించుకున్న అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అలాగే.. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి కూడా తన మద్దతు ఉంటుందని ఆస్ట్రేలియా పునరుద్ఘాటించింది.
గవీకి రూ. 113కోట్లు ఇస్తాం
గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్(గవీ)కి భారత్ తరపున రూ. 113కోట్లు ఇస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే) నిర్వహించిన గవీ వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో ఆయనీ మేరకు పేర్కొన్నారు.
ఈసారి కిచిడీ వండుతా :మోరిసన్
మోదీతో భేటీకి నాలుగు రోజుల ముందు.. సమోసాలు వండడం ద్వారా వార్తల్లో నిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.. గురువారం ఆన్లైన్ భేటీలో సమోసాలతోపాటు మోదీకి ఇష్టమైన కిచిడీ ప్రస్తావన కూడా తెచ్చారు. ఆయన ఆలింగనాన్ని మిస్సవుతున్నానని చెప్పారు. ‘‘ప్రముఖమైన మోదీ ఆలింగనం కోసం అక్కడికి (భారత్కు) రావాలనుకున్నా. అలాగే నా సమోసాలను పంచుకోవాల్సి ఉంది. ఈసారి గుజరాతీ కిచిడీ చేస్తాను. మీకది చాలా ఇష్టమని ఇంతకుముందు మీరే నాతో చెప్పారు. ఈసారి మనిద్దరం వ్యక్తిగతంగా కలవడానికి ముందు కిచిడీ చేయడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు.