ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజులిలా...

ABN , First Publish Date - 2020-06-05T13:39:41+05:30 IST

కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాల్సిన ఫీజుల వివరాల విషయమై

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజులిలా...

చెన్నై: కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాల్సిన ఫీజుల వివరాల విషయమై భారతీయ వైద్య మండలి (ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌) తమిళనాడు విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 25 వేలు దాటింది.  ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పతుల్లో కూడా కరోనా రోగులకు చికిత్సలందిస్తున్నారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్సలందించడానికి అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ఇటీవల మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్సలందించడానికి ఫీజులను త్వరలో నిర్ణయిస్తామని ప్రకటించారు. ఆ మేరకు గురువారం భారత వైద్య పరిశోధనామండలి రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్సలందించడానికి వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలను ప్రకటించింది. పాజిటివ్‌ లక్షణాలు కలిగి ఆరోగ్యపరిస్థితి స్వల్పంగా క్షీణించి ఉంటే 10 రోజుల చికిత్సకు రూ.2,31,820లను ఫీజుగా వసూలు చేయాలని తెలిపింది. కరోనా వైరస్‌ తాకిడి స్వల్పంగా ఉన్న రోగులకు రోజుకు రూ.23,182 రూపాయల వంతున ఫీజులు వసూలు చేయవచ్చునని పేర్కొంది. తీవ్ర చికిత్సలు పొందాల్సిన రోగులు రోజుకు రూ.25,377 చొప్పున 17 రోజులకు ఫీజుగా రూ.4,31,411లను చెల్లించాలని వివరించింది. చికిత్సలతోపాటు ఆహారం తదితర సదుపాయాలకుగాను రోజుకు రూ.9,600లు చొప్పున వసూలు చేయవచ్చునని భారతీయ వైద్యమండలి తమిళనాడు విభాగం ప్రకటించింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన మీదట ఫీజుల వివరాలను ఖరారు చేస్తారని తెలుస్తోంది.

Updated Date - 2020-06-05T13:39:41+05:30 IST