దివాలా ఆర్థికంలో కరోనా కష్టాలు

ABN , First Publish Date - 2020-03-18T06:01:14+05:30 IST

దేశంలో ఏదో జరుగుతున్నట్లు కనిపించాలంటే పార్లమెంటు సమావేశాలు సాగుతున్నట్లు కనిపించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడుతున్నారా? అందుకేనేమో ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అట్టుడికి పోతుండగా...

దివాలా ఆర్థికంలో కరోనా కష్టాలు

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మిస్తున్న వారు అనేకమంది అప్పుల వలయంలో చిక్కుకుపోతున్నారు. స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల 2020–21 ఆర్థిక సంవత్సరంలో మరింత పడిపోతుందని నిపుణుల అంచనా. బ్యాంకింగ్ రంగం సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి లేదని యెస్ బ్యాంక్ సంక్షోభం స్పష్టం చేసింది. కరోనా వైరస్ మూలంగా మార్కెట్ మరింత తీవ్రంగా దెబ్బతినడం ఖాయం. ప్రధాని మోదీ దృష్టి ఈ మహమ్మారిపై కంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న అంశంపైనే కేంద్రీకృతమయింది. సంపద పెంచుకోవడం మాట దేవుడెరుగు, ఉన్న సంపద హరించుకుపోకుండా చూడడం ఎలాగో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.


దేశంలో ఏదో జరుగుతున్నట్లు కనిపించాలంటే పార్లమెంటు సమావేశాలు సాగుతున్నట్లు కనిపించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడుతున్నారా? అందుకేనేమో ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అట్టుడికి పోతుండగా, పార్లమెంటు సమావేశాలను యథా ప్రకారం ఏప్రిల్ 2 వరకు జరిపించాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పార్లమెంటు ఉభయ సభల్లో ఢిల్లీ అల్లర్లపై జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జవాబిచ్చిన తర్వాత ఆసక్తికరమైన కార్యకలాపాలేమీ జరగలేదు. వివిధ మంత్రిత్వ శాఖల పద్దులతో పాటు మొత్తం ఆర్థిక పద్దుల ఆమోదం కూడా లాంఛనంగా జరిగిపోయింది. ఇక ఏ క్షణంలోనైనా పార్లమెంటును వాయిదా వేసి తమను స్వస్థలాలకు పంపిస్తారేమోనని పలువురు ఎంపీలు భావిస్తుండగా, ప్రధాని మాత్రం ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంతో పార్లమెంటును వాయిదా వేస్తే మధ్యప్రదేశ్‌లో ఈ వైరస్ బూచితో విశ్వాస పరీక్ష జరపకుండా స్పీకర్ సభను వాయిదా వేయడం సరైనదేనని ఒప్పుకోవాల్సి వస్తుందేమోనని బిజెపి పెద్దలు భయపడుతున్నట్లు కనపడుతోంది. నిజానికి పార్లమెంటుకు హాజరవుతున్న ఎంపీల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. సెంట్రల్ హాలుకు కూడా ఎంపీలు రావడం తగ్గించేశారు. జనం రాకపోకల్ని కొన్ని గేట్లకే పరిమితం చేసి స్క్రీనింగ్ మొదలు పెట్టారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రోజులో అధిక భాగం ప్రత్యేక ప్రస్తావనలకు అవకాశం ఇచ్చి ఎంపీలు మాట్లాడేందుకు వీలు కల్పిస్తున్నారు. సభలో అధిక సమయం గడిపేందుకు ప్రాధాన్యమిచ్చే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సైతం ఇప్పుడు ఎక్కువ సేపు సభలో ఉండడం లేదు.


ఈ సమావేశాల్లో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అకస్మాత్త్తుగా ఉభయ సభల్లో తమ వైఖరిని మార్చుకుని కీలకమైన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయడం ఒక కొత్త పరిణామం. ఢిల్లీ అల్లర్లు, పౌరసత్వ చట్టం వంటి అంశాలపై పార్లమెంటును కొంతకాలం స్తంభింప చేసిన ప్రతిపక్షాలు ఆ తర్వాత ఇతర అంశాలపై దృష్టి మళ్లించడం ప్రారంభించాయి. అస్తమానం మతపరమైన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే దాని వల్ల తమకే నష్టం కలుగుతుందని వారు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల్లో అనేక అంశాలపై ఐక్యత లేదు. భాషా సమస్యపై మంగళవారం కాంగ్రెస్ సభ్యులు వాకాట్ చేసినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కదలకుండా కూర్చుని ఉండడం కనిపించింది. చాలా అంశాలపై కాంగ్రెస్, డిఎంకెలలో మినహా ఇతర ప్రతిపక్ష సభ్యుల్లో కదలిక కనపడడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రసమితి, వైసీపీ పార్టీల సభ్యులకు తాము ప్రతిపక్షంలో ఉన్నామో, లేక అధికార పక్షంలో ఉన్నామో తేల్చుకోలేని పరిస్థితి కనపడుతోంది. దేశంలో సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు గురించి రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ప్రాచీన భాషలుగా గుర్తింపు పొందిన దక్షిణాది భాషలకు జరుగుతున్న అన్యాయం గురించి కాంగ్రెస్ ఎంపి జైరాం రమేశ్, ఇతర దక్షిణాది ఎంపీలు ప్రస్తావించగా ఈ బిల్లు అద్భుతమైనదని వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి ప్రశంసించారు. ఇక దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దడంపై మంగళవారం ఆ ప్రాంత ఎంపీల ఆందోళనతో రాహుల్ గాంధీ కూడా గొంతు కలపగా, మన తెలుగు ఎంపిలు మాత్రం ఏమీ జరగనట్లు కూర్చోవడం కనిపించింది! అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, మన దేశంలో మాత్రం వాటి ప్రయోజనాలను సామాన్యులకు అందించకపోవడంపై కాంగ్రెస్, తృణమూల్ ఎంపీలు నిరసన వ్యక్తం చేసినప్పుడు అదేదో మనకు సంబంధించిన విషయం కాదన్నట్లు తెలుగు ఎంపిలు వ్యవహరించడం గమనార్హం. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టడంపై కాంగ్రెస్, ఇతర సభ్యులు నిరసన తెలిపినప్పుడు కూడా వారు స్తబ్దంగానే ఉండిపోయారు. ప్రతిపక్షాల ఐక్యత లేమివల్ల ఎంతటి తీవ్రమైన అంశాన్ని లేవనెత్తినా దానికి అంత ప్రాధాన్యత లభించడం లేదు.


నిజానికి సోమవారం రాహుల్ గాంధీ బ్యాంకుల నుంచి భారీ రుణాలు తీసుకుని ఎగగొట్టిన 50 మంది వివరాలను ప్రశ్నించినప్పుడు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దేశంలో మొండి బాకీల మూలంగా బాగా దెబ్బతిన్న బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణగ్రహీతలు ఎగవేసిన మొత్తం రూ. 13,473 కోట్లు కాగా, భారత దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 13,432 కోట్ల మేరకు రుణాలను వసూలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నది. దేశంలోని 18 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 9 ప్రైవేట్ రంగ బ్యాంకులు వేల కోట్ల అప్పులు ఇచ్చి వాటిని మాఫీ చేయాల్సిన దుస్థితిలో ఉన్నాయి. గత డిసెంబర్ నాటికి బ్యాంకులకు రూ.9,58,167 కోట్ల మేరకు నిరర్థక ఆస్తులున్నాయని ఆర్థిక మంత్రి తన జవాబులో చెప్పారు. అయితే, తన జాబితాలో యెస్ బ్యాంకును ఎందుకు చేర్చలేదో ఆయనకే తెలియాలి.


ఈ ప్రభుత్వం ఎప్పుడూ బ్యాంకులకు ఎంత మొత్తం ఎగ్గొట్టారో చెబుతుంది కాని ఎవరు ఎగ్గొట్టారన్న విషయాన్ని చెప్పేందుకు సంకోచిస్తుంది. సంపదను కొల్లగొట్టే వారినే సంపద సృష్టించే వారుగా ప్రభుత్వం భావించడమే ఇందుకు కారణం. అయితే మాజీ బిజెపి ఎంపి కిరీటి సోమయ్య మాత్రం యెస్ బ్యాంకు ఎగవేత దారుల వివరాలను వెల్లడించారు. ఇన్వెస్టర్స్ గ్రీవెన్స్ ఫోరమ్ సంస్థాపకుడైన కిరీటి సోమయ్య చెప్పిన వివరాల ప్రకారం యెస్ బ్యాంకుకు దేశంలో మహా మహా సంపద సృష్టికర్తలే దాదాపు రూ. 60 వేల కోట్ల మేరకు రుణాలు బాకీ పడ్డారు. వారిలో రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ రు. 12,800 కోట్లు, ఎస్సెల్ గ్రూప్ రూ. 8400 కోట్లు, డిహెచ్ఎఫ్ఎల్ గ్రూప్ రూ. 4735కోట్లు, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ రూ. 2500 కోట్లు, జెట్ ఎయిర్ వేస్ రూ. 1100 కోట్లు బకాయి ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే అనిల్ అంబానీ ప్రపంచంలో అతి పెద్ద బ్యాంకు అయిన ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాతో పాటు మరో మూడు బ్యాంకులకు 700 మిలియన్ డాలర్లు కట్టలేక తన గ్రూప్ నికర విలువ ఏమీ లేదని చేతులెత్తేశారు. మరో ఆరు వారాల్లో ఆయన 100 మిలియన్ డాలర్లు కట్టాల్సిందేనని ఇటీవల ఒక లండన్ కోర్టు కూడా ఆదేశించింది. మరి రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే దసో ఏవియేషన్ కంపెనీ అనిల్ అంబానీని భారత దేశంలో తన భాగస్వామిగా ఎలా ఎంచుకున్నదో ఆ కంపెనీకే తెలియాలి. రాహుల్ గాంధీకి ఇచ్చిన జవాబు ప్రకారం తానే రూ. 13,432 కోట్లు వసూలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఎస్‌బీఐ రూ. 60 వేల కోట్ల మేరకు అప్పుల వలయంలో ఉన్న యెస్ బ్యాంకును కాపాడేందుకు ఆగమేఘాలపై ఎందుకు రంగంలో దిగిందో, ఎవర్ని కాపాడేందుకు దాన్ని రంగంలోకి దించారో ఆ బ్యాంకు పెద్దలే చెప్పాలి. విచిత్రమేమంటే ఎవరి హయాంలో బ్యాంకులు ఎక్కువ అప్పుల వలయంలో చిక్కుకుపోయాయో లెక్కలు అన్వేషించేందుకు కాంగ్రెస్, బిజెపి పెద్దలు తల మునకలై ఉన్నారు కాని ఈ సంక్షోభాన్ని నివారించేందుకు మార్గాలు ఎవరి వద్దా ఉన్నట్లు లేవు.


ఇవాళ దేశంలో కంపెనీ లా ట్రిబ్యునల్, కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్, ఇతర కోర్టుల్లో ఉన్న పిటీషన్లను చూస్తుంటే దివాళా తీసి వేల కోట్లు ఎగ్గొట్టేందుకు ఎన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఇన్ సాల్వెన్సీ అండ్ బాంక్రప్ట్సీ (ఐబి కోడ్) క్రింద గత ఏడాది వరకే రూ. 2,57,642 కోట్ల మేరకు బకాయిలు ఉన్న 378 కంపెనీలను తెగనమ్మేందుకు పిటిషన్లు దాఖలయ్యాయి. ఐబీ కోడ్ కింద రుణదాతల కమిటీ 270 రోజుల్లో పరిష్కారాన్ని ఆమోదించకపోతే కంపెనీ లా ట్రిబ్యునల్ ఆ కంపెనీని ఎంతో కొంతకు తెగనమ్మేందుకు ప్రయత్నిస్తుంది. గతంలో ఇలా అమ్మేందుకు రెండేళ్ల సమయం ఉండేది కాని ఇప్పుడు ఆ సమయాన్ని ఏడాదికే తగ్గించారు. దీని వల్ల కంపెనీల విలువ తీవ్రంగా తగ్గిపోతోంది. ఐబి బోర్డ్ డాటా ప్రకారం 2019 డిసెంబర్ 31 వరకు 51 కంపెనీలను తెగనమ్మడానికి (లిక్విడేషన్) ప్రయత్నిస్తే రూ. 9870 కోట్ల క్లెయిమ్‌లకు గాను రూ. 96 కోట్లే వచ్చాయి. ఈ స్వల్ప మొత్తాన్నే అప్పిచ్చిన వారికి పంచిపెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం 551 లిక్విడేషన్ కేసుల ద్వారా అప్పిచ్చిన వారు రూ. 4.47 లక్షల కోట్లు ఆశిస్తుండగా, లిక్విడేషన్ విలువ రూ. 22,147 కోట్లు మాత్రమే ఉండడం గమనార్హం. సంపద సృష్టిస్తారనుకున్న వారి సంపద విలువ ఎంత పడిపోతుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. మన ఆర్థిక మంత్రి మాత్రం దేశంలో వ్యాపార సంస్థలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని. ఉద్యోగాలను పెంచుతాయని, సంపద ప్రవహించేలా చేస్తాయని అపారమైన నమ్మకంతో రకరకాల చట్టాలనుంచి విముక్తి కల్పిస్తూ 76 రకాల రాయితీలను ఎడాపెడా ప్రకటించారు. అయినప్పటికీ దేశంలో సంపద కుదించుకుపోవడమో, స్తంభించిపోవడమో జరుగుతోంది కాని ప్రవహించే పరిస్థితి కనపడడం లేదు. ఇన్‌సాల్వెన్సీ కోడ్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన సవరణల మూలంగా ఆమె ఆశించినట్టు పెట్టుబడిదారుల విశ్వాసం పెరగకపోగా మరింత క్షీణించేందుకు ఆస్కారం కలుగుతోంది.


దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో పార్లమెంటులో కొందరు ఎంపిలు, మాజీ ఎంపిలు తమ సంస్థల, తమకు తెలిసిన వారి సంస్థల బకాయిల విషయంలో చేస్తున్న పైరవీలను బట్టి అర్థమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సన్నిహితంగా మారితే తమ ఆర్థిక సమస్యల నుంచి వారు కాపాడతారని, బిల్లులు త్వరగా వసూలవుతాయని, కొత్త కాంట్రాక్టులు లభిస్తాయని భావించే వారు పెరిగిపోతున్నారు. ఈ దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేసిన వారు అనేకమంది అప్పుల వలయంలో చిక్కుకుపోతున్నారు. దేశంలో జీడీపీ పెరుగుదల వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత పడిపోతుందని మూడీ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. బ్యాంకింగ్ రంగం సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి కనపడడం లేదని యెస్ బ్యాంక్ సంక్షోభం తర్వాత స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్ మూలంగా మార్కెట్ మరింత తీవ్రంగా దెబ్బతింటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలా అన్నదాని కన్నా రోజురోజుకూ పెరిగిపోతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న అంశంపైనే ప్రధాని మోదీ దృష్టి కేంద్రీకృతమయింది. సంపద పెంచుకోవడం మాట దేవుడెరుగు, ఉన్న సంపద హరించుకుపోకుండా చూడడం ఎలాగో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-03-18T06:01:14+05:30 IST