‘నా భార్య చనిపోయిన రెండేళ్లకు వ్యాక్సిన్ ఎలా వేశారు?’
ABN , First Publish Date - 2022-01-20T06:14:11+05:30 IST
కరోనా వ్యాక్సినేషనలో విచిత్రాలకు ఇది పరాకాష్ట. వ్యాక్సిన వేయించుకున్నా.. వేయించుకున్నట్లు సెల్ఫోన్లకు మెసేజ్లు వస్తుండడంతో జనం అ యోమయం చెందుతున్నారు.
కంబదూరు, జనవరి 19: కరోనా వ్యాక్సినేషన్లో విచిత్రాలకు ఇది పరాకాష్ట. వ్యాక్సిన్ వేయించుకోకున్నా.. వేయించుకున్నట్లు సెల్ఫోన్లకు మెసేజ్లు వస్తుండడంతో జనం అయోమయం చెందుతున్నారు. తాము వ్యాక్సినే వేయించుకోకుంటే వేయించుకున్నట్లు మెసేజ్లు రావడమేంటని వాపోతున్నారు. ఇలా.. వ్యాక్సిన్ పంపిణీలో ఇష్టారాజ్యంపై వైద్య సిబ్బంది తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని అందుకోవడానికే ఇలా అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వైద్య సిబ్బంది ఇష్టారాజ్యానికి ఇది పరాకాష్ట. బతికున్న వారికి వ్యాక్సిన్ వేయించుకున్నట్లు మెసేజ్ రావడం ఒక ఎత్తయితే.. ఏకంగా చనిపోయిన వారు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు మెసేజ్ రావడంతో షాక్ తిన్నారు. అది కూడా.. రెండు డోసులు పూర్తి చేసుకున్నట్లు రావడం విడ్డూరం కాక ఏంటి? కంబదూరు మండలం వైసీ పల్లికి చెందిన బీటీ లక్ష్మీదేవి 2020 ఫ్రిబవరిలో మరణించింది. ఆమె ఈనెల 18న కొవిషీల్డ్ రెండో డోసు పూర్తి చేసుకున్నట్లు ఆమె భర్త, మాజీ సర్పంచ్ తిరుపాల్ సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదివిన భర్త అవాక్కయ్యాడు. రెండేళ్ల క్రితమే చనిపోయిన తన భార్య ఇప్పుడు కొవిషీల్డ్ ఎలా వేయించుకుంటుందని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. అది కూడా రెండు డోసులు పూర్తయినట్లు మెసేజ్ రావడం గమనార్హం. లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే ఇలా చేశారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తిరుపాల్ కోరారు.
చనిపోయిన నా భార్యకు రెండు డోసులు ఎలా వేశారు?:
రెండేళ్ల క్రితమే నా భర్య బీటీ లక్ష్మీదేవి మరణించింది. రెండు డోసులు వేసుకున్నట్లు తాజాగా మెసేజ్లు రావడం ఆశ్చర్యమేసింది. చనిపోయిన వ్యక్తులకు కూడా డోసులు వేస్తున్నారా? ఇది పూర్తిగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి, బాధిత వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.
తిరుపాల్, మాజీ సర్పంచ్, రాంపురం