కొవిడ్ కల్లోలం
ABN , First Publish Date - 2020-04-04T11:52:29+05:30 IST
కొవిడ్ కల్లోలం
కొత్తగా 102 పాజిటివ్ కేసులు
400 దాటిన కరోనా బాధితులు
చెన్నైలోనే అత్యధికం ఫ 27 జిల్లాలకు పాకిన వైరస్
మూడో దశలోకి ప్రవేశించలేదు - ఆరోగ్యశాఖ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమిళనాడును కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం కొత్త 102 కేసులు బయటపడగా, మొత్తం సంఖ్య 411కు చేరుకుంది. గత నాలుగు రోజుల్లో ఒక్కసారిగా 300కుపైగా కేసులు పెరగడంతో మూడో దశలోకి అడుగుపెట్టామా అన్న భయాం దోళనలు నెలకొన్నాయి. అయితే తమిళనాడులో వైరస్ ఇంకా రెండో దశలోనే ఉందని, మూడో దశలోకి ప్రవేశించలేదని, కొత్తగా నమోద వుతున్న కేసుల్లో దాదాపుగా అన్ని ఢిల్లీ మహానాడులో పాల్గొన్నవారివేనని ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం సాయంత్రం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా సోకినవారి సంఖ్య రాష్ట్రంలో 411కు చేరుకుందని, అయితే అందరి ఆరోగ్యం స్థిరంగానే ఉందని తెలిపారు. కొత్తగా నిర్ధారించిన 102 కేసుల్లో వంద మంది ఢిల్లీ మహానాడులో పాల్గొన్నవారేనని, ఒకరు అమెరికా నుంచి వచ్చినవారు కాగా, మరొకరి ట్రావెల్ హిస్టరీ వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,142 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని, ఢిల్లీ మహానాడులో పాల్గొన్న 1200 మందికి పరిశోధనలు చేశామని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా, ఇక రాష్ట్రంలో 27 జిల్లాలకు కరోనా పాకింది. అధికంగా చెన్నైలో 81 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఐదుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పులియాన్తోపు, ఎన్నూర్, తండయార్పేట, నేతాజీనగర్, ముత్యాల్పేట, పుదుపేట, పురసైవాక్కం, సైదాపేట, వేళచ్చేరి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలను మరింత తీవ్రతరం చేశారు.