కరోనా వార్డులకు ఏసీలు, ఫ్రిజ్లు
ABN , First Publish Date - 2020-04-04T12:49:47+05:30 IST
కరోనా వార్డులకు ఏసీలు, ఫ్రిజ్లు
చెన్నై,(ఆంధ్రజ్యోతి): గృహోపయోగ ఎలక్ర్టానిక్స్ వస్తువుల తయారీలో పేరెన్నికగన్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సంస్థ కరోనా వైరస్ నిరోధక ఉద్యమంలో భాగంగా కరోనా బాధితులకు చికిత్సలందించే ఐసోలేషన్ వార్డులకు ఉచితంగా ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలను అందజేసింది. పలు రాష్ట్రాలకు చెందిన 50కి పైగా జిల్లా ఆసుపత్రులకు వీటిని ఉచితంగా అందించినట్టు ఎల్జీ ఎలక్ర్టానిక్స్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యంగ్ లక్ కిమ్ తెలిపారు. కరోనా నిరోధక చర్యలలో భాగంగా దేశమంతటా అమలు చేస్తున్న లాక్డౌన్ వంటి నిషేధాజ్ఞల వల్ల అన్నపానీయాలు లేకుండా అలమటిస్తున్న వలస కార్మికులకు, నిరుపేద కూలీలకు రోజూ మూడు పూటలా భోజన సదుపాయం కల్పించేందుకుగాను తమ సంస్థ అక్షయపాత్ర సంస్థకు రూ.2 కోట్లను విరాళంగా ఇచ్చిందని ఆయన చెప్పారు. అక్షయపాత్ర సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీరస్ సుందీప్ తల్వార్ మాట్లాడుతూ తమ సంస్థకు విరాళం ప్రకటించిన ఎల్జీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేట్ సంస్థలు ఈ విపత్కర సమయంలో నిరుపేదల ఆకలిదప్పులు తీర్చేందుకు ముందు కు రావాలని ఆయన పిలుపునిచ్చారు.