వేగంగా వ్యాక్సిన్‌.. సాధ్యమే!

ABN , First Publish Date - 2020-07-10T08:22:23+05:30 IST

వేగంగా వ్యాక్సిన్‌.. సాధ్యమే!

వేగంగా వ్యాక్సిన్‌.. సాధ్యమే!

ఫేజ్‌-1 ట్రయల్స్‌కు పట్టేది నెల రోజులే

అనుమతులు, ఫైలింగ్‌తోనే ఆలస్యం

భారత్‌ బయోటెక్‌ అధికారి వెల్లడి

పరీక్షలు పక్కాగానే నిర్వహిస్తాం

విధానపరమైన ప్రక్రియ వేగవంతం

ఆగస్టు 15 డెడ్‌లైన్‌పై ఐసీఎంఆర్‌


ఆగస్టు 15కల్లా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రూపొందించడమే లక్ష్యమని ఐసీఎంఆర్‌ ప్రకటించింది! మరి.. అంత వేగంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం సాధ్యమేనా? అంటే.. సాధ్యమేనని కొందరు వైద్యనిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేగవంతమైన పరీక్షలే సరైన విధానమని అభిప్రాయపడుతున్నారు. అసలు పరీక్షలకు పట్టే సమయం తక్కువని, అనుమతులు, ఇతరత్రా ఫైలింగ్‌ ప్రక్రియలకే ఎక్కువ సమయం పడుతుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్‌ చేస్తున్నది ఆ విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయడమేనని వివరిస్తున్నారు. కోవాగ్జిన్‌ను రూపొందిస్తున్న భారత్‌ బయోటెక్‌కు చెందిన ఒక అధికారి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 


ఆగస్టు 15కల్లా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రూపొందించడమే లక్ష్యమని ఐసీఎంఆర్‌ ప్రకటించింది! మరి.. అంత వేగంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం సాధ్యమేనా? ఆలోగా ట్రయల్స్‌ పూర్తి చేయగలరా? అంటే.. సాధ్యమేనని కొందరు వైద్యనిపుణులు అంటున్నారు.  సుదీర్ఘంగా జరిగే వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రక్రియలో అసలు పరీక్షలకు పట్టే సమయం తక్కువని, దానికి సంబంధించిన అనుమతులు, ఇతరత్రా ఫైలింగ్‌ ప్రక్రియలకే ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్‌ చేస్తున్నది ఆ విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయడమేనని వివరిస్తున్నారు. కోవాగ్జిన్‌ను రూపొందిస్తున్న భారత్‌ బయోటెక్‌కు చెందిన ఒక అధికారి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ‘‘సాధారణంగా మానవ పరీక్షల్లో భాగంగా.. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారి ఆరోగ్యాన్ని నెలరోజులపాటు పరిశీలించాల్సి ఉంటుంది. మిగతా సమయమంతా ఎథిక్స్‌ కమిటీ అనుమతులకు, ట్రయల్స్‌ నిర్వహిస్తున్న శాస్త్రజ్ఞులు తమ నివేదికలను డీసీజీఐకు సమర్పించడానికి, తదితరాలకు పడుతుంది. కాబట్టి, మేం పరీక్షల వరకూ నిర్ణీత ప్రొటోకాల్‌ ప్రకారమే చేస్తాం. నివేదికల సమర్పణ, అనుమతుల వంటి విధానపరమైన అంశాలకు పట్టే సమయాన్ని మాత్రమే తగ్గిస్తాం’’ అని ఆయన వివరించారు. మనదేశంలో వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు సంబంధించి అధికారిక రిజిస్ట్రీ అయిన.. ‘క్లినికల్‌ ట్రయల్‌ రిజిస్ట్రీ ఆఫ్‌ ఇండియా (సీటీఆర్‌ఐ)’కి ఇచ్చిన నివేదికలోనూ భారత్‌ బయోటెక్‌ ఇదే విషయాన్ని రాతపూర్వకంగా పేర్కొంది. దాని ప్రకారం.. కోవాగ్జిన్‌ తొలి దశ పరీక్షల్లో పాల్గొన్నవారిపై ఆ వ్యాక్సిన్‌ ప్రభావం ఎంతమేరకు ఉంది?, అది ఎంతవరకూ సురక్షితం?, రోగనిరోధక వ్యవస్థను ఏమేరకు ఉత్తేజితం చేసింది వంటి వివరాలను భారత్‌ బయోటెక్‌ 28 రోజుల తర్వాత సీటీఆర్‌ఐకి సమర్పించాలి.  ఇక, ఫేజ్‌-2 పరీక్షలను ‘ర్యాండమైజ్డ్‌ డబుల్‌ బ్లైండ్‌’ విధానంలో నిర్వహిస్తారు. అంటే.. పరీక్షల్లో పాల్గొనేవారిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపులోనివారికి కోవాగ్జిన్‌ను ఇస్తారు. మరో గ్రూపులోనివారికి ప్లాసిబో (సెలైన్‌ వాటర్‌ లేదా వేరే  వ్యాక్సిన్‌ (ఇప్పటికే సురక్షితమని నిరూపితమైన వ్యాక్సిన్‌)) ఇస్తారు. రెండో దశ పరీక్షల నిర్వహణకు 12 ఏళ్ల నుంచి 65 ఏళ్లలోపున్న ఆరోగ్యవంతులను ఎంచుకుంటారు. వారికి ఫేజ్‌ 1 ట్రయల్స్‌ ఫలితాల ఆధారంగా నిర్ణీత డోసులో మొదటిరోజు, 14వ రోజు.. అంటే రెండుసార్లు వాక్సిన్‌ ఇస్తారు. రెండో దశలో ఇచ్చిన వ్యాక్సిన్‌ రోగనిరోధక వ్యవస్థను ఎంతమేరకు ఉత్తేజితం చేసిందనే విషయాన్ని 14వ రోజున, 28, 104, 194 రోజుల్లో పరిశీలిస్తారు. ఈ దశలో కూడా దాదాపు నెలరోజుల్లోనే వ్యాక్సిన్‌ పనితీరుపై ఒక అంచనా వచ్చేస్తుంది. కాగా కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో విజయం సాధించిన జైడస్‌ కాడిలా కూడా 1000 మందిపై మానవ పరీక్షలకు సిద్ధమైంది. ఆ సంస్థ తయారుచేసిన ‘జైకొవ్‌-డి’ వ్యాక్సిన్‌.. డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌. దాంతో ఈ నెలలోనే మానవ పరీక్షలను ప్రారంభించనున్నట్టు జైడస్‌ కంపెనీ  తెలిపింది.  ఆగస్టు 15లోగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడమే లక్ష్యం అంటూ ఐసీఎంఆర్‌ పెట్టిన డెడ్‌లైన్‌పై విమర్శలు రావడంతో.. ఆ సంస్థ కూడా ఇదే విషయాన్ని ఒక బహిరంగ లేఖ ద్వారా స్పష్టం చేసింది. ‘‘క్లినికల్‌ట్రయల్స్‌ నిర్వహించే ఆస్పత్రులకు ఐసీఎంఆర్‌ డీజీ రాసిన లేఖ.. పరీక్షల విషయంలో అనవసరమైన రెడ్‌టేపిజానికి అడ్డుకట్ట వేయడానికి, పార్టిసిపెంట్లను త్వరగా ఎంపిక చేసుకోవాలని చెప్పడానికి ఉద్దేశించింది. అంతే తప్ప.. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో తప్పనిసరి అయిన ఏ ప్రక్రియనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.  వీలైనంత వేగంగా ఈ పరీక్షలను పూర్తిచేయడమే మా లక్ష్యం’’ అని ఐసీఎంఆర్‌ ఆ లేఖలో పేర్కొంది. 


వేగంగా.. ఆ రెండు వ్యాక్సిన్లు

ఇప్పటిదాకా అత్యంత వేగంగా అభివృద్ధి అయింది.. గవద బిళ్లల వ్యాక్సిన్‌. 1967లో ఆ వైరస్‌ ఐసోలేషన్‌ నుంచి వ్యాక్సిన్‌కు అనుమతి రావడం వరకు 4 ఏళ్లు పట్టింది. ఎబోలా వైరస్‌ను 2014లో ఐసోలేట్‌ చేసి 2019 కల్లా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ అందుబాటులోకి వస్తే ఇదే అత్యంత వేగంగా అభివృద్ధి అయిన వ్యాక్సిన్‌.


మా వ్యాక్సిన్‌ ఆర్నెల్ల తర్వాతే!

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడి

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని, అది ఎంతవరకూ సురక్షితమనే విషయాన్ని ధ్రువీకరించుకున్నాకే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా తెలిపారు. అందుకు 6 నెలలు పడుతుందన్నారు. భారత్‌లో ఆ వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాకు ఆస్ట్రాజెనెకాతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కలిసింది.


-సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-07-10T08:22:23+05:30 IST