తగ్గినట్టే తగ్గి మళ్లీ..

ABN , First Publish Date - 2020-10-14T08:18:35+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72,082 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,622 మందికి...

తగ్గినట్టే తగ్గి మళ్లీ..

  • రాష్ట్రంలో మరో 4,622 కేసులు 
  • ఒక్కరోజులోనే 1400 పెరుగుదల
  • 7.63 లక్షలకు చేరిన పాజిటివ్‌లు
  • కరోనాతో మరో 35 మంది మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72,082 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,622 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. సోమవారం 3,224 కేసులు మాత్రమే నమోదవగా.. 24 గంటల్లోనే దానికి దాదాపు 1400 కేసులు అధికంగా నమోదవడం గమనార్హం. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 7,63,573కి పెరిగింది.


మంగళవారం పశ్చిమగోదావరిలో 752 మందికి వైరస్‌ సోకగా.. చిత్తూరులో 705, తూర్పుగోదావరిలో 691, ప్రకాశంలో 442 కేసులు బయటపడ్డాయి. ఇక రాష్ట్రంలో కొత్తగా 5,715 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మొత్తం రికవరీలు 7,14,427కి పెరిగాయి. 42,855 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనాతో మరో 35 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,291కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో 7 మంది ప్రాణాలు కోల్పోగా.. కృష్ణాలో 5, కడపలో 4, ప్రకాశంలో 4, అనంతపురంలో 3, గుంటూరులో 3, విశాఖపట్నంలో 3, తూర్పుగోదావరిలో 2, నెల్లూరులో 2, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 


చిత్తూరు జిల్లాలో కరోనా అలజడి

చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్‌ అలజడి కొనసాగుతూనే ఉంది. జిల్లాలో మంగళవారం కొత్తగా 705 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,982కి పెరిగింది. కరోనాతో ఏడుగురు మృతిచెందగా.. మరణాల సంఖ్య 714కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో 24 గంటల్లో 691 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇద్దరు మృతిచెందారు. పశ్చిమగోదావరిలో 752 మందికి వైరస్‌ సోకగా.. ఇప్పటివరకు 475 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లాలో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతిచెందారు. కడప జిల్లాలో మరో 317 కేసులు బయటపడగా.. ఇప్పటివరకు 475 మంది చనిపోయారు. కర్నూలు జిల్లాలో మరో 88 కేసులు నమోదవగా.. బాధితుల సంఖ్య 58,329కి పెరిగింది. నెల్లూరు జిల్లాలో 228 మందికి వైరస్‌ సోకగా.. ఇద్దరు మృతిచెందారు. గుంటూరు జిల్లాలో 391 కేసులు వెలుగుచూశాయి. కరోనాతో ఇప్పటివరకు 630 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో కొత్తగా 416 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో ఐదుగురిని కరోనా కబళించింది. శ్రీకాకుళంలో 101, విజయనగరం జిల్లాలో 159, విశాఖలో 168 కేసులు బయటపడ్డాయి.

Updated Date - 2020-10-14T08:18:35+05:30 IST