లాక్‌డౌన్‌.. మరింత కఠినం

ABN , First Publish Date - 2020-04-04T10:22:24+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండటంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ తెలిపారు.

లాక్‌డౌన్‌.. మరింత కఠినం

కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు

కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌


నెల్లూరు (వైద్యం), ఏప్రిల్‌ 3 : జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండటంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ తెలిపారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు.  అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రాకూడదని, నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాధారణ వ్యాధిగ్రస్థులకు వైద్య సేవలు అందించేందుకు ప్రైవేట్‌ ఆసపత్రులు, అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.


విద్యాశాఖలోని పీఈటీలు, పీడీల సేవలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 32 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 291 మంది అనుమానితుల నమూనాలను తిరుపతి స్విమ్స్‌కు పంపామని, మరో 71 మంది రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నమోదైన పాజిటివ్‌ కేసులన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన వారివేనని చెప్పారు. జిల్లా నుంచి మొత్తం 420 మంది ఢిల్లీలో ప్రార్థనలకు హాజరైనట్లు సమాచారమని, పూర్తిస్థాయి సర్వే చేస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. నెల్లూరు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐపై వచ్చిన ఆరోపణలపై ఈ నెల 15వ తేదీన ఆర్డీవో, డీఎ్‌సపీలు విచారణ జరుపుతారని తెలిపారు. 

Updated Date - 2020-04-04T10:22:24+05:30 IST