అది కరోనా మరణమే

ABN , First Publish Date - 2020-04-08T08:57:18+05:30 IST

‘కరోనాతో చెలగాటం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రచురించిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

అది కరోనా మరణమే

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ప్రభుత్వం స్పందన 


కర్నూలు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ‘కరోనాతో చెలగాటం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రచురించిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కర్నూలులో తొలి కరోనా మరణం నిజమేనని వెల్లడిస్తూ అధికారికంగా లేఖ విడుదల చేసింది. జిల్లాకు చెందిన 45ఏళ్ల పేషెంట్‌ ఏప్రిల్‌ 1న కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. వెంటనే కోవిడ్‌-19 పరీక్షల నిమిత్తం అతని నమూనాలను వైద్యులు సేకరించారు. ఆ వ్యక్తికి అంతకుముందే డయాబెటిస్‌ ఉన్నట్లు వైద్యశాఖ నిర్ధారించింది.


కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారించిన ఈ పేషెంట్‌ చికిత్స తీసుకుంటూ 3న కర్నూలు ప్రభుత్వాస్పత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో మృతి చెందాడని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆయనకు ఢిల్లీ ప్రయాణంతో ఏ సంబంధం లేదని ధ్రువీకరించింది. కాగా, కర్నూలు జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రక్రియను మరింత కఠినతరం చేశారు. ఇప్పటికే ఈ జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 74కు చేరిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన అధికారులు ఆంక్షలను కట్టుదిట్టం చేశారు. నంద్యాలలో 48 గంటల నిర్బంధ కర్ప్యూ విధించగా మిగిలిన ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. 

Updated Date - 2020-04-08T08:57:18+05:30 IST