కరోనాకు చైనా మందు... 99.9 % పనిచేస్తుందట!

ABN , First Publish Date - 2020-03-30T18:04:41+05:30 IST

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఓరకంగా యుద్ధమే జరుగుతోంది. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న..

కరోనాకు చైనా మందు... 99.9 % పనిచేస్తుందట!

చైనా: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఓరకంగా యుద్ధమే జరుగుతోంది. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భూతాన్ని ఈ భూగోళం నుంచే తరిమికొట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓవైపు.. ఈ వైరస్‌ బారిన పడకుండా లాక్‌డౌన్‌లతో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు.. ఎక్కడికక్కడ.. ఈ వైరస్‌ను అంతం చేసేందుకు అవసరమైన మందులను తయారుచేసేందుకు లాబొరేటరీల్లో నిరంతరాయంగా పరీక్షలు జరుగుతున్నాయి. 


ఫార్మారంగం అభివృద్ధి చెందిన దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనాకు విరుగుడు కనిపెట్టే చర్యలు విస్తృతమయ్యాయి. అయితే.. ఈ వైరస్‌ను నాశనం చేసేందుకు, సోకకుండా అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి గురించి అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కానీ,  ఇప్పుడు ఈ వైరస్‌ ఎక్కడైతే పురుడు పోసుకుందో అక్కడే దీనిని ఎదుర్కొనే మందు విషయంలో పురోగతి సాధించామంటూ చైనా శాస్త్రవేత్తల బృందాన్ని ఉటంకిస్తూ ఓ ట్వీట్‌ ఆదివారం బయటకు వచ్చింది.



కరోనా వైరస్‌మీద పోరాటానికి నానో మెటీరియల్‌ను అభివృద్ధి చేస్తున్నారంటూ చైనీస్‌ న్యూస్‌ పోర్టల్స్‌ వెల్లడించాయి.  కోవిడ్‌-19 వ్యాధికి కారణమవుతున్నకరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయన్నది వాటి సారాంశం. అయితే.. ఇప్పుడు చైనా శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేస్తున్నది ఒక ఆయుధమో, మందో, మందుల సమ్మేళనమో కాదని, అవి కొన్ని సూక్ష్మపదార్థాలని చెబుతున్నారు. 96.5 శాతం నుంచి 99.9 శాతం సామర్థ్యంతో ఈ ప్రాణాంతక వైరస్‌ను గ్రహించి, నిష్క్రియం చేయగల నానోమెటీరియల్‌ను చైనాలో కనుగొన్నారని ప్రకటించారు.

వాస్తవానికి పెయింట్లు, ఫిల్టర్లు, ఇన్సులేషన్, లూబ్రికెంట్స్‌ సహా వివిధ రకాల ఉత్పాదక ప్రక్రియలు, ఉత్పత్తులతో పాటు.. ఆరోగ్య సంరక్షణలో సూక్ష్మ పదార్ధాలను ఉపయోగిస్తారు. వాటి మాదిరిగానే.. ఆరోగ్య సంరక్షణలో, నానోజైమ్‌లు ఎంజైమ్ లాంటి లక్షణాలతో కూడిన సూక్ష్మ పదార్ధాలను కనుగొన్నారని ఉధృతంగా ప్రచారం జరుగుతోంది.  

క్యాన్సర్ కణాలు వంటి శరీరంలోని నిర్దిష్ట అవయవాలు లేదా కణాలను లక్ష్యంగా చేసుకునే ఔషధాలను తయారుచేసేందుకు నానో టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం ఉందని అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పద్ధతిలో చికిత్స ప్రభావం కూడా పెరుగుతుందని నిర్ధారిస్తున్నారు. 

సప్తగిరి గోపగోని
(ఏబీఎన్‌ రెడ్‌అలర్ట్‌ డెస్క్‌ ఇంచార్జ్‌)

Updated Date - 2020-03-30T18:04:41+05:30 IST