మేఘాలయలో 89 శాతం కరోనా రికవరీ రేటు... కారణమిదే!
ABN , First Publish Date - 2020-07-09T14:15:21+05:30 IST
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే, ఈశాన్య రాష్ట్రాలలో కరోనా కేసులు ప్రస్తుతం అదుపులో ఉన్నాయి. దీనికి కారణం ఇక్కడి ప్రభుత్వాలు విధించిన కఠిన నిబంధనలను ప్రజలు పాటించడమేనని...
న్యూఢిల్లీ: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే, ఈశాన్య రాష్ట్రాలలో కరోనా కేసులు ప్రస్తుతం అదుపులో ఉన్నాయి. దీనికి కారణం ఇక్కడి ప్రభుత్వాలు విధించిన కఠిన నిబంధనలను ప్రజలు పాటించడమేనని తెలుస్తోంది. 37 లక్షల జనాభా కలిగిన మేఘాలయలో జూలై 5 నాటికి మొత్తం 70 కేసులు నమోదయ్యాయి. వీరిలో 43 మంది వ్యాధి నుంచి కోలుకొని తమ ఇళ్లకు వెళ్లగా, ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గురించి మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ కేంద్రం లాక్డౌన్ ప్రకటించక ముందే తాము అప్రమత్తం అయ్యామని, ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సన్నాహాలు ప్రారంభించామని తెలిపారు. ప్రజల మద్దతుతో కరోనాను కట్టడి చేయగలిగామన్నారు. సామాజిక దూరం పాటించడంతోపాటు, మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన సమాచారం ప్రకారం, మేఘాలయలో రికవరీ రేటు 89.1 శాతంగా ఉంది. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా అధికం. కాగా ఈశాన్య రాష్ట్రాల్లోని అసోంలో అత్యధిక సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. జూలై 5 నాటికి అసోంలో కరోనా రోగుల సంఖ్య 11,736 గా ఉంది. ఆరోగ్యశాఖ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 7,433 మంది రోగులు కోలుకున్నారు. 14 మంది మృతి చెందారు.