ఆత్రంతో అనర్థం!

ABN , First Publish Date - 2020-03-26T08:40:54+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల ‘లాక్‌డౌన్‌’ ప్రకటించింది. అంటే... ఎవరికి వారు ఇళ్లలో ఉండాలి. సమూహంలో తిరగకుండా జాగ్రత్తపడాలి. అయితే, ప్రతిరోజూ ఉదయం...

ఆత్రంతో అనర్థం!

కూరగాయల కోసం గుంపులు.. అవసరానికి మించి కొనుగోళ్లు

ఉంటాయని తెలిసీ ఆదుర్దా.. కృత్రిమ డిమాండ్‌తో ధరల భారం

కనిపించని ‘సామాజిక దూరం’.. సహనం పాటించడమే మార్గం

కృత్రిమ డిమాండ్‌తో ధరల భారం

మొబైల్‌ రైతు బజార్లతో మేలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘లాక్‌డౌన్‌’.... మనకు కొత్త అనుభవం! 

ఇళ్ల నుంచి బయటికి రాకూడదు! అలాగని, పూర్తిస్థాయి కర్ఫ్యూ కూడా కాదు!

మనకోసం మనమంతా కలిసి పాటించాల్సిన జాగ్రత్త! కానీ... ఒక విధమైన ఆత్రుత! ఇదే... అనర్థానికీ కారణమవుతోంది.


కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల ‘లాక్‌డౌన్‌’ ప్రకటించింది. అంటే... ఎవరికి వారు ఇళ్లలో ఉండాలి. సమూహంలో తిరగకుండా జాగ్రత్తపడాలి. అయితే, ప్రతిరోజూ ఉదయం పరిమితమైన సమయంలో మాత్రమే కూరగాయలు, నిత్యావసరాల దుకాణాలు తెరుస్తుండటంతో... అందరూ అదే సమయానికి బయటికి వస్తున్నారు. ‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? రేపు దొరుకుతాయో లేదో!’ అనే ఆదుర్దాతో గుంపులు గుంపులుగా దుకాణాల ముందు చేరుతున్నారు. దీంతో ‘సామాజిక దూరం’ అనే ప్రాథమిక ఉద్దేశమే దెబ్బతింటోంది. అంతేకాదు, ధరల పెరుగుదలకూ ఇదే కారణమవుతోంది.  


ప్రతిరోజూ ఉంటాయి

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ... కూరగాయలు, నిత్యావసరాల సరఫరాపై ఎలాంటి నిషేధం లేదు. వాటికి కొరతా లేదు. ఈ విషయాన్ని  పరిగణనలోకి తీసుకోకుండా... ఇక దొరకవేమో అన్నట్లుగా రైతు బజార్లకు, నిత్యావసరాల షాపులకు పరిగెత్తితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. అంతా ఒకేసారి, అవసరానికి మించి కొనడంవల్ల కృత్రిమ డిమాండ్‌ ఏర్పడుతోంది.  ఒకవైపు పరుగు పరుగున మార్కెట్‌కు వెళ్లి కొనుగోళ్లు చేయడం, మరోవైపు ధరలు పెరిగాయని బాధపడటం.. వద్దే వద్దని అధికారులు చెబుతున్నారు. ‘‘నిత్యావసరాలకు, కూరగాయలకు ఎలాంటి కొరతా లేదు. కావాల్సిందంతా... సహనమూ, సంయమనమే!  దయచేసి గుంపులుగా చేరవద్దు.’’ అని సూచిస్తున్నారు. ఇక.. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా రైతు బజార్లను వికేంద్రీకరించాల్సి ఉంది. మొబైల్‌ రైతు బజార్లను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తేవాలి. కొరత ఉందనే భావన రాకుండా అన్ని నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలి.

Updated Date - 2020-03-26T08:40:54+05:30 IST