శంకుస్థాపనతోనే సరి!
ABN , First Publish Date - 2022-01-27T04:54:38+05:30 IST
ఆమనగల్లులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం
- పనుల ప్రారంభం ఎప్పుడో మరి!
- ప్రారంభం కాని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు
ఆమనగల్లు, జనవరి 26: ఆమనగల్లులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైంది. పనులు చేయడంలో చొరవ కరువైంది. రెండు నెలల కింద మంత్రులు శంకుస్థాపన చేసి వదిలేశారు. మున్సిపాలిటీలో మాంసం, చేపలు, కూరగాయల విక్రయాల కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.4.5కోట్లు మంజూరు చేసింది. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో రెండు ఎకరాల భూమి కేటాయించారు. గత నవంబర్ 8న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కాగా నేటికీ పనులు మొదలుపెట్టలేదు. ఏళ్లుగా అంగడి బజార్లో రోడ్లపై అమ్మకాలను కొనసాగిస్తున్నారు. రైతుబజార్ కోసం స్థానికులు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏడాది క్రితం ప్రభుత్వం మున్సిపాలిటీకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ను మంజూరు చేసింది. దీని నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని, మున్సిపల్ పాలకవర్గాన్ని కోరుతున్నారు.