కార్పొరేషన్లో అవినీతిపై విచారణ జరపాలి
ABN , First Publish Date - 2021-06-18T05:25:15+05:30 IST
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజిలెన్స్ డీజీకి ఫిర్యాదు చేసింది.
కోల్సిటీ, జూన్ 17: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజిలెన్స్ డీజీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ముదాం శ్రీనివాస్ గురువారం విజిలెన్స్ డీజీ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీకి ఫిర్యాదు పత్రం అందజేశారు. నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై కార్పొరేషన్ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాజేష్ థియేటర్ నుంచి కల్లు డిపో వరకు నిర్మిస్తున్న రూ.50లక్షల డివైడర్ టెండర్ నిబంధనల్లో ఎలక్ర్టికల్ క్లాస్-1 లైసెన్స్ అడిగారని, సదరు కాంట్రాక్టర్ మాత్రం ట్రేడ్-ఏ ఎలక్ర్టికల్ సర్టిఫికెట్ పెట్టాడని, కానీ ఇంజనీర్లు టెండర్ అగ్రిమెంట్ చేశారన్నారు. 90శాతం సివిల్, 10శాతం ఎలక్ర్టికల్ పని ఉన్నా క్లాస్ వన్ లైసెన్స్ను అడిగారన్నారు. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించారని, మొక్కలకు నష్టం చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.