రాష్ట్రంలో అవినీతికి సబ్‌ చల్తా హై

ABN , First Publish Date - 2021-10-23T08:01:38+05:30 IST

అవినీతి విషయంలో ‘సబ్‌ చల్తా హై’ అన్నట్లుగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఉందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) ఆందోళన వ్యక్తంచేసింది. తప్పుచేస్తే శిక్షపడుతుందన్న భయం ఏ ఉద్యోగికి కూడా లేకుండాపోయిందని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి ..

రాష్ట్రంలో అవినీతికి సబ్‌ చల్తా హై

  • గవర్నర్‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఫిర్యాదు


హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అవినీతి విషయంలో ‘సబ్‌ చల్తా హై’ అన్నట్లుగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఉందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) ఆందోళన వ్యక్తంచేసింది. తప్పుచేస్తే శిక్షపడుతుందన్న భయం ఏ ఉద్యోగికి కూడా లేకుండాపోయిందని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి  శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు ఒక లేఖ రాశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పౌరులకు చట్టబద్ధంగా అందవలసిన సేవలకు కూడా లంచం ఇవ్వక తప్పడంలేదన్నారు. ఏసీబీ కేసులనూ సచివాలయంలో  ఉన్నతాధికారులు నీరు గారుస్తున్నారని ఆరోపించారు. అవినీతిని అరికట్టడంలో ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌, విజిలెన్స్‌ కమిషన్‌, ట్రైబ్యునల్‌ ఫర్‌ డిసిప్లీనరీ ప్రొసీడింగ్స్‌ ముఖ్యభూమిక పోషిస్తాయని తెలిపారు. వాటిలో ఏసీబీ, సీఐడీకి ఉన్నతాధికారులు లేరని, డీజీ విజిలెన్స్‌ అధికారులే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించారు.


ముఖ్యమైన మూడు శాఖలకు ఒకే అధికారి ఉండటంతో ఆయన ఏ శాఖకూ న్యాయం చేయలేకపోతున్నారన్నారు. ట్రైబ్యునల్‌ ఫర్‌ డిసిప్లీనరీ ప్రొసీడింగ్స్‌కు జడ్జి లేకపోవడంతో వందల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఏడు సంవత్సరాల నుంచి ఒకే విశ్రాంత పోలీసు అధికారి విజిలెన్స్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. కమిషన్‌ వార్షిక నివేదికలపై శాసనసభలో చర్చ జరగాలని ఆదేశాలు ఉన్నా, ఏడేళ్లుగా వాటిని రాష్ట్ర సచివాలయంలో తొక్కిపెడుతున్నట్లు విమర్శించారు.

Updated Date - 2021-10-23T08:01:38+05:30 IST