విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

ABN , First Publish Date - 2021-07-22T08:22:52+05:30 IST

విశాఖ ఏజెన్సీలో మరోసారి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గూడెంకొత్తవీధి మండలం అమ్మవారి ధారకొండ పంచాయతీ పెబ్బెంపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

గూడెంకొత్తవీధి/చింతపల్లి/సీలేరు జూలై 21: విశాఖ ఏజెన్సీలో మరోసారి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గూడెంకొత్తవీధి మండలం అమ్మవారి ధారకొండ పంచాయతీ పెబ్బెంపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లలేదని తెలిసింది. చింతపల్లి ఏఎస్పీ తెలిపిన సమాచారం ప్రకారం...అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్న సందర్భంగా మావోయిస్టులు  ఏవోబీ గ్రామాల్లో ముందస్తుగా సభలు ఏర్పాటు చేస్తున్నట్టు, గత నెలలో కొయ్యూరు మండలం తీగల మెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల పేరిట స్థూపాలు నిర్మిస్తున్నట్టు పోలీసు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో వారం రోజుల నుంచి ప్రత్యేక పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం  కూంబింగ్‌ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్‌ దళాలకు అమ్మవారి ధారకొండ పంచాయతీ పెబ్బెంపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య సుమారు 25 నిమిషాలపాటు కాల్పులు జరిగాయి. పోలీసులకు ఎటువంటి హాని కలగలేదని, మావోయిస్టులు కాల్పులు జరుపుతూ సమీప అడవుల్లోకి పారిపోయారని, వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఏఎస్పీ తుషార్‌ డుడి చెప్పారు.

Updated Date - 2021-07-22T08:22:52+05:30 IST