లెక్కలున్నా.. మొక్కలేవీ?

ABN , First Publish Date - 2021-12-02T06:16:00+05:30 IST

హరితహారం కార్యక్రమం విజ యవంతానికి ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ జిల్లాలో ఆ లక్ష్యం నెరవేరడం లేదు.

లెక్కలున్నా.. మొక్కలేవీ?
పిచ్చి మొక్కల మధ్యలో నిండిపోయిన పెంచిన మొక్కలు

లెక్కలున్నా.. మొక్కలేవీ?

 క్షేత్రస్థాయిలో కన్పించని హరితహారం మొక్కలు 

 ప్రతి సంవత్సరం అటవీశాఖకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం 

సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వాస్తవాలు 


హరితహారం కార్యక్రమం విజ యవంతానికి ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ జిల్లాలో ఆ లక్ష్యం నెరవేరడం లేదు. మొక్కలు పెంచడానికి జిల్లా అటవీశాఖకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు మంజూరు చేస్తుంది. అధికారుల అలసత్వం, ఉన్నతాధి కారుల పర్యవేక్షణ లోపించడంతో ఆ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 

- సూర్యాపేట సిటీ/తిరుమలగిరి


హరితహారం మొక్కల పెంపకానికి విడుదలైన నిధులు, వాటి ఖర్చు వివరాలను మండలాల వారీగా ఇవ్వాలని చింతలపాలం మండలంలోని ఓ వ్యక్తి ఇదే ఏడాది అక్టోబరు 20వ తేదీన సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లా అటవీశాఖ అధికారులకు దరఖాస్తు  చేశాడు. ఆ సమాచారాన్ని నవంబరు 18వ తేదీన అతడికి ఇచ్చారు. అందులో ఉన్న వివరాలు పరిశీలిస్తే పెంపకంలో అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతోంది.

 

లెక్కలు ఉన్నాయి, కానీ మొక్కలే లేవు

2017-18 ఆర్థిక సంవత్సరంలో సూర్యాపేట, మఠంపల్లి, కోదాడ మండ లాల్లో హరితహారం మొక్కల పెంపకం కోసం అటవీశాఖకు ప్రభుత్వం రూ.12,14,700లు విడుదల చేసింది. ఆ నిధులతో 1,15,000 మొక్కలు పెం చినట్లు తెలిపారు. మొక్కల పెంపకానికి రూ.12,00,743లు ఖర్చు చేసిన ట్లు చూపారు. మిగితా రూ.13,957లు రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయానికి తిరిగి పంపినట్లు పేర్కొన్నారు. కేవలం 1,15,000 మొక్కలకు రూ.12లక్షలు ఖర్చు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూలీల ఖర్చు, ప్యాకింగ్‌ కవర్లు, నర్సరీ వాటర్‌ డ్రమ్స్‌ తదితర ఖర్చులు ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లిస్తారు. 


   2018- 19 సంవత్సరంలో ఇలా.. 

2018-19 ఆర్థిక సంవత్సరంలో సూర్యాపేట, మఠంపల్లి, కోదాడ తదితర ప్రాంతాల్లో హరితహారం మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం రూ.12,77,793 విడుదల చేసింది. ఈ నిధుల్లో కేవలం ఒక్క సూర్యాపేట మండలానికి మూడుసార్లు నిధులు మంజూరయ్యాయి. మొదటి విడతలో రూ.27,750లు విడుదలైన ఆ నిధులతో 10వేల మొక్కలు పెంచినట్లు లెక్కచూపి, విడుదలైన రూ.27,750లు మొత్తం ఖర్చు చూపారు. రెండో విడత రూ.68,250లు నిధులతో 30 వేల మొక్కలు పెంచినట్లు చూపి, మొ త్తం రూ.68,250లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు. మూడో విడత రూ.6,67,800లు నిధులు మంజూరైతే ఆ నిధులతో 55వేల మొక్కలు నాటి నట్లు లెక్కలు చూపారు. విడుదలైన రూ. 6,67,800ల్లో, రూ. 6,59,514లు ఖర్చు చేసినట్లు చూపారు. మిగిలిన రూ.8,286లు రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయానికి పంపినట్లు చూపారు. ఒక్క సూర్యాపేట మండలానికి మూడు దఫాలుగా నిధులు విడుదల చేయించుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నుంచి విడుదలైన మొత్తం నిధులతో మూడు ప్రాంతాల్లో  2,00,000 మొక్కలను పెంచినట్లు లెక్కల్లో చూపారు. మొక్కలను పెంచినందుకు రూ. 12,36,009లు ఖర్చు చేశారు. ఇక్కడ కూడా 2లక్షల మొక్కల పెంచినందుకు రూ.12 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మంజూరైన మొత్తం నిధులు రూ. 12,77,793లు నుంచి రూ. 12,36,009లు ఖర్చు చేయగా రూ.41,784లు మిగులుగా చూపారు.


    2019- 20 సంవత్సరంలోనూ ఇదే..

2019-20 ఆర్థిక సంవత్సరంలో సూర్యాపేట, పెన్‌పహాడ్‌, పాలకవీడు ప్రాంతాల్లో హరితహారం మొక్కల పెంపకానికి రూ.30,66,314లు నిధులు మంజూరైనట్లు లెక్కలు చూపారు. విడుదలైన నిధులతో 3,10,000 మొక్కలు పెంచినట్లు తెలిపారు. అందుకు రూ.26,80,640లు ఖర్చు చేసినట్లు చూపారు. మిగిలిన రూ.3,85,674లు రాష్ట్ర కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. 3లక్షల మొక్కలు పెంచడం కోసం రూ.26 లక్షలు ఖర్చు చేయడం  గమనార్హం. 

   

నిర్లక్ష్యానికి సాక్ష్యాలు..

పెన్‌పహాడ్‌ మండలం ధర్మాపురం గ్రామంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో వననర్సరీ ఏర్పాటు చేశారు. మండలంలోని ఐదు గ్రామాలకు పైగా లక్ష మొక్కలను పంపిణీ కోసం ఒక నర్సరీ ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ నర్సరీ ఈ విధంగా మారింది. లక్ష మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నా చివరకు 50 వేల మొక్కలు కూడా పెంచలేకపోయారు. దీంతో మరుసటి సంవత్సరం నుంచి ఈ గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వన నర్సరీ ఏర్పాటు చేశారు. మొ క్కలు పెంచకున్నా పెంచినట్లు ఈ నర్సరీకి కూడా అటవీశాఖ అధికారులు బిల్లులు మంజూరు చేయించుకోవడం కొసమెరుపు.


నిర్లక్ష్యంగా వదిలేసిన నర్సరీ

నర్సరీలపై అధికారుల నిర్లక్ష్యంతో మొక్కలు నాటడానికి వీలులేకుండా మారాయి. నర్సరీల్లో పెంచిన మొక్కల వేర్లు భూమిలోకి పాతుకుని, చిన్న, చిన్న వృక్షాలుగా ఎదిగాయి. తిరుమలగిరిలో మూడు నర్సరీలను ఏర్పాటు చేశారు. హరితహారం తర్వాత నర్సరీలను పట్టించుకోకపోవడం తో ఏవి పిచ్చిమొక్కలో, ఏవి పెంచిన మొక్కలో తెలియకుండా ఉన్నాయి. నర్సరీ అంతా గడ్డి మొలిచి, చాలావరకు మొక్కలు నేలపై పడి మట్టిలో కలిసిపోయాయి. మూడు నర్సరీల ద్వారా మొత్తం లక్షా 30వేల మొక్క లు పెంచినట్లు అధికారులు లెక్కలు కట్టారు. 73,217 మొక్కలు హరిత హారంలో నాటగా, 56,783 మొక్కలు మిగిలినట్లు తెలిపారు. మూడు నర్సరీల్లో మిగిలిన మొక్కలన్నీ వేర్లు భూమిలోకి పాతుకుపోయాయి.  


టెండర్‌ ఆలస్యంతో సకాలంలో నాటలేకపోయాం

టెండర్‌ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల, మొక్కలు నాటడం ఆలస్యమైంది. దీని వల్ల మొక్కలు పెద్దగా పెరిగాయి. మునిసిపాలిటీ పరిధిలోని రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాం.

- దండు శ్రీను, మునిసిపల్‌ కమిషనర్‌

Updated Date - 2021-12-02T06:16:00+05:30 IST