హత్య కేసులో దంపతుల అరెస్టు
ABN , First Publish Date - 2020-06-05T10:50:43+05:30 IST
బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామపంచా యతీ పరిధిలోని రంగపేటలో భూ వివాదంలో చల్లూరి
బెల్లంపల్లిటౌన్, జూన్ 4: బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామపంచా యతీ పరిధిలోని రంగపేటలో భూ వివాదంలో చల్లూరి దుర్గయ్యను హత్య చేసిన దంపతులను గురువారం అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్ తెలిపారు. గురువారం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చల్లూరి దుర్గయ్య కు ఇంటి పక్కనే గల దాగం సురేందర్తో కొద్ది సంవత్సరాలుగా ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయని సీఐ తెలిపారు. ఇదే క్రమంలో సురేందర్ ఈ నెల 2వతేదీన తన ఇంటిగోడకు ప్లాస్టింగ్ పనులు చేయిన్నాడని చెప్పారు. దీన్ని దుర్గయ్య అడ్డుకొని బెల్లంపల్లికి వెళ్లాడని తెలిపారు. దుర్గయ్య ఇంటికి వచ్చేసరికి సురేందర్ మళ్లీ పనులు కొనసాగిస్తున్నాడు.
దుర్గయ్య సురేందర్ను మందలించాడని, దీంతో ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సురేందర్, అతడి భార్య కవిత దుర్గయ్యను, అతడి భార్య పావనిని నెట్టి వేశారని సీఐ తెలిపారు. కింద పడ్డ దుర్గయపై సురేందర్ బండరాళ్ళతో తలపై మోదాడని, దీంతో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ వివరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సురేందర్తో పాటు అతడి భార్యను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో తాళ్ళగురిజాల ఎస్సై బానోతు సమ్మయ్య పాల్గొన్నారు.