ప్రాణాలు తీసిన రాంగ్‌రూట్‌

ABN , First Publish Date - 2021-12-07T07:28:47+05:30 IST

కొంత స్కూటీ నడుపుతున్న వ్యక్తి స్వయంకృతం.. ఇంకొంత ఎదురుగా దూసుకొచ్చిన కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం వెరసి హైదరాబాద్‌లోని గండిపేట వద్ద ఘోర ప్రమాదం. త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరలో స్కూటీపై దంపతులు రాంగ్‌రూట్‌లో వెళుతుండగా.. ఎదురుగా వేగంగా వస్తున్న కారు బలంగా..

ప్రాణాలు తీసిన రాంగ్‌రూట్‌

  • స్కూటీని ఢీకొన్న కారు దంపతుల దుర్మరణం! 
  • గండిపేట వద్ద ఘోరం
  • బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
  • రోడ్డు దాటుతున్న ఇద్దరు బలి
  • రెండు ఘటనల్లోనూ మద్యం మత్తులో కారు డ్రైవర్లు



నార్సింగ్‌, బంజారాహిల్స్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కొంత స్కూటీ నడుపుతున్న వ్యక్తి స్వయంకృతం.. ఇంకొంత ఎదురుగా దూసుకొచ్చిన కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం వెరసి హైదరాబాద్‌లోని గండిపేట వద్ద ఘోర ప్రమాదం. త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరలో స్కూటీపై దంపతులు రాంగ్‌రూట్‌లో వెళుతుండగా.. ఎదురుగా వేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. స్కూటీ నుంచి ఎగిరిపడ్డ దంపతులు, కోకాపేటకు చెందిన దుర్గం రాజు (37), మౌనిక (28)  తలలు పగిలి అక్కడికక్కడే మృతిచెందారు. వీరికి ముగ్గురు పిల్లలు. రాజు ఇళ్లలో వార్తాపత్రికలు, పాల ప్యాకె ట్లు వేస్తుంటాడు. మౌనిక డ్వాక్రా గ్రూప్‌ లీడర్‌. సోమవారం ఉదయం గండిపేటలోని బ్యాంకులో డ్వాక్రా గ్రూప్‌ నగదును డిపాజిట్‌ చేసిన దంపతులు,  తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ సంజీవకు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్ష నిర్వహించగా మద్యం తాగినట్లు తేలింది. తల్లిదండ్రుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఇక బంజారాహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ కారు బీభత్సం సృష్టించింది. ఉప్పల్‌ నుంచి మద్యం తాగేందుకు ఖరీదైన కారులో దూసుకెళుతున్న ఇద్దరు, నగరంలో పలు బార్లకు తిరుగుతూ.. రోడ్డు దాటుతున్న ఇద్దరిని బలంగా ఢీకొట్టారు.


ఈ ప్రమాదంలో యూపీకి చెందిన అయోధ్య రాయ్‌ (26), ఒడిసాకు చెందిన దేవేంద్ర కుమార్‌ (29) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయా రు. రాయ్‌ బంజారాహిల్స్‌ రెయిన్‌బో ఆస్పత్రిలో యుటిలిటీ బాయ్‌గా, దేవేంద్ర అసిస్టెంట్‌ కుక్‌గా పనిచేస్తున్నారు. నైట్‌ డ్యూటీలో ఉన్న వీరు అర్ధరాత్రి 1:20కు టీ తాగేందుకు ఆస్పత్రి ఎదురుగా ఉన్న బండి దగ్గరకు వచ్చారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఓ పోషే కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎగిరి పడ్డ ఇద్దరూ మృతిచెందారు. నిందితులను రోహిత్‌ గౌడ్‌, సాయి సోమన్‌గా గుర్తించారు. రోహిత్‌.. ఈఎల్‌వీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కాగా, సాయి అతడి స్నేహితుడు. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.  

Updated Date - 2021-12-07T07:28:47+05:30 IST