భార్యాభర్తల మాస్టర్ ప్లాన్.. రైలు ప్రయాణికులే టార్గెట్..
ABN , First Publish Date - 2020-03-22T18:23:09+05:30 IST
రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దంపతుల్ని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితుల నుంచి 42 తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
రైళ్లలో చోరీలు - దంపతుల అరెస్టు
42 తులాల ఆభరణాలు స్వాధీనం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దంపతుల్ని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితుల నుంచి 42 తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బెన్నన్, ఎస్సై ప్రమోద్ తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల షాపూర్, శివాలయం ప్రాంతానికి చెందిన మంద కుమర్(39), భార్య మంద గౌరి(35) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఇతర రైల్వే స్టేషన్లలో రైల్ ప్రయాణికులను టార్గెట్ చేసి ప్రయాణికుల బ్యాగులను తస్కరించేవారు.
ప్రయాణికులు రైళ్లు ఎక్కే సమయంలో బ్యాగు జిప్ తెరిచి అందులో ఉన్న నగల్ని కాజేసేవారు. రైల్వే స్టేషన్ప్లాట్ఫాంపై ఆదమరిచి ఉన్న మహిళల బ్యాగుల నుంచి బంగారు నగల్ని చోరీ చేసే వారని పోలీసులు తెలిపారు. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తచ్చాడుతూ కనిపించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. ఇద్దరు ఇప్పటి వరకు పది కేసుల్లో నిందితులను పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి రూ.16.80 లక్షల విలువ చేసే 42 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.