‘నిర్భయ’ దోషి వినయ్ శర్మకు షాక్.. దోషుల ఉరికి మార్గం సుగమం
ABN , First Publish Date - 2020-02-23T00:06:21+05:30 IST
నిర్భయ దోషుల ఉరికి మార్గం సుగమం అవుతోంది. తన మానసిక స్థితి సరిగా లేదని, మెరుగైన
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరికి మార్గం సుగమం అవుతోంది. తన మానసిక స్థితి సరిగా లేదని, మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరుతూ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ను పాటియాల హౌస్ కోర్టు శనివారం కొట్టివేసింది. మరణశిక్ష పడిన దోషిలో సాధారణ ఆందోళన, నిరాశ స్పష్టంగా కనిపిస్తోందని, దోషికి వైద్య, మానసిక చికిత్స ఇప్పటికే అందాయని విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంటూ వినయ్శర్మ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ.. మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషి ఆడుతున్న నాటకంలో భాగమే ఇదని మండిపడ్డారు. కోర్టును వారు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయని పేర్కొన్నారు. మార్చి మూడో తేదీన దోషులను ఉరి తీస్తారని నమ్ముతున్నట్టు చెప్పారు.
అంతకుముందు జైలు అధికారుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తూ.. దోషి చెబుతున్నదాంట్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. పిటిషనర్ గోడకు తలను బాదుకోవడం నిజమే అయినా, అది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని కోర్టుకు తెలిపారు. వైద్యులు అతడిని పరీక్షించి మందులు ఇచ్చారని పేర్కొన్నారు. దోషి తరపు లాయర్ చెబుతున్నట్టు అతడికి ఎలాటి ఫ్రాక్చర్ కాలేదని, అతడి మానసిక ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఇటీవలే అతడు తన తల్లితోను, న్యాయవాదితోనూ మాట్లాడాడని, అలాంటప్పుడు అతడు తల్లిని గుర్తించడం లేదని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వినయ్ పెట్టుకున్న పిటిషన్ను కొట్టివేసింది.