మాటల్లో మునిగిపోయిన నర్సు... మహిళకు రెండుసార్లు కరోనా టీకా ఇచ్చింది!

ABN , First Publish Date - 2021-04-03T16:56:55+05:30 IST

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది.

మాటల్లో మునిగిపోయిన నర్సు... మహిళకు రెండుసార్లు కరోనా టీకా ఇచ్చింది!

కాన్పూర్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల వ్యాక్సినేషన్‌లో పొరపాట్లు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఘటనే యూపీలోని కాన్పూర్‌‌ దేహాత్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక ఎఎన్ఎం... ఒక మహిళకు రెండుసార్లు కరోనా టీకా ఇచ్చింది. మోడల్ పీహెచ్సీ‌లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కమలేష్ దేవి అనే మహిళ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆమెకు వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు ఫోనులో మాట్లాడుతూ ఆమె భుజంపై ఒకేచోట రెండుసార్లు వ్యాక్సిన్ ఇచ్చింది. 


ఈ విషయాన్ని ఆ మహిళ గుర్తు చేయగానే, ఆ నర్సు పొరపాటు జరిగిందని చెప్పింది. అయితే విషయం తెలుసుకున్న ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కమలేష్ దేవి మాట్లాడుతూ తనకు వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు ఫోనులో ఎవరితోనే మాట్లాడుతూ తనకు వ్యాక్సిన్ ఇచ్చిందన్నారు. తాను అక్కడే కూర్చున్నప్పటికీ తనను  వెళ్లాలని చెప్పకుండా మరోమారు తనకు టీకా ఇచ్చిందన్నారు. దీంతో తాను రెండుసార్లు టీకా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించగా, ఆమె కోపంతో ఊగిపోతూ వ్యాక్సిన్ వేశాక ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చున్నావని ఎదురు ప్రశ్న వేసిందన్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఈ ఉదంతంపై దర్యాప్తునకు ఆదేశించారు. 

Updated Date - 2021-04-03T16:56:55+05:30 IST