40 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-03-01T05:33:24+05:30 IST
జిల్లాలో సోమవారం నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు.
నేటి నుంచి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు..
ఎంపిక చేసిన ప్రైవేటు వైద్యశాలల్లో రూ.250కి కొవిడ్ వ్యాక్సిన్
డీఎంహెచ్వో డాక్టర్ యాస్మిన్
గుంటూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. మొత్తం 40 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వీటిల్లో ఏడు కేంద్రాలు ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించామన్నారు. 10 కేంద్రాలు పోలీసు శాఖకి, 23 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో హెల్త్కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వర్కర్స్కు తొలి, రెండో డోస్ చేస్తామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన కేంద్రాల్లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి రూ.250 తీసుకొని వ్యాక్సినేషన్ వేస్తారని చెప్పారు. కోవిన్యాప్, ఆన్లైన్లో ప్రభుత్వం నిర్దేశించిన గుర్తింపు పత్రంతో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
పోలీసులకు కేటాయించిన కేంద్రాలు
డీజీపీ ఆఫీసు, ఏపీఎస్పీ ఆఫీసు, యూనిట్ ఆస్పత్రి, ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్, తెనాలి, బాపట్ల, గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట, తుళ్లూరు.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు
గుంటూరు నగరంలో శ్రీనివాసరావుతోట అర్బన్ హెల్త్ సెంటర్, లాంచెస్టర్ రోడ్డు యూహెచ్సీ, ప్రభుత్వ సాదారణ ఆస్పత్రి, తెనాలి డిస్ట్రిక్ హాస్పిటల్, నరసరావుపేట ఏరియా హాస్పిటల్, బాపట్ల ఏరియా హాస్పిటల్, మాచర్ల సీహెచ్సీ, చిలకలూరిపేట రజకపేట యూహెచ్సీ, వినుకొండ సీహెచ్సీ, పిడుగురాళ్ల పీహెచ్సీ, మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రి, కొచ్చర్ల పీహెచ్సీ, కారంపూడి పీహెచ్సీ, పొన్నెకల్లు, కొల్లూరు, నాదెండ్ల, క్రోసూరు, దాచేపల్లి, నుదురుపాడు, సత్తెనపల్లి, దుగ్గిరాల, కనగాల, దుర్గి పీహెచ్సీలు.
ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సినేషన్ సెంటర్లు
జిల్లాలో చినకాకాని ఎన్ఆర్ఐ, మణిపాల్, కొత్తపేట లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, యనమదలలోని కాటూరి మెడికల్ కళాశాల, నరసరావుపేటలోని జీబీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పిడుగురాళ్లలోని అంజిరెడ్డి హాస్పిటల్, తెనాలిలోని హెల్త్ హాస్పిటల్స్ ఉన్నాయి.
జిల్లాలో 17 కరోనా కేసులు
గుంటూరు (మెడికల్) ఫిబ్రవరి 28: జిల్లాలో ఆదివారం కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గుంటూరు నగరంలో 7 కేసులు, పెదకాకాని, నరసరావుపేటలో రెండేసి కేసులు, మేడికొండూరు, తాడేపల్లి, తుళ్లూరు, మాచర్ల, పొన్నూరు, తెనాలిలో ఒక్కో కరోనా పాజిటివ్ కేసును నిర్ధారించారు. ఆదివారం చిత్తూరులో అత్యధికంగా 41 కేసులు నమోదు కాగా, 17 కేసులతో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో కొద్ది రోజులుగా స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ యాస్మిన్ కోరారు.