ఆ రోజు నాటికి అమెరికాలో పతాకస్థాయికి చేరనున్న కరోనా కేసులు.. తర్వాత..

ABN , First Publish Date - 2022-01-13T19:57:54+05:30 IST

అంతకుముందు వారంతో పోలిస్తే గతవారంలో కరోనా కేసులు 55% పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. గత

ఆ రోజు నాటికి అమెరికాలో పతాకస్థాయికి చేరనున్న కరోనా కేసులు.. తర్వాత..

19వ తేదీకి అమెరికాలో రోజువారీ కేసులు పతాకస్థాయికి

తర్వాత క్రమంగా తగ్గిపోతాయని అంచనా

జెనీవా, జనవరి 12: అంతకుముందు వారంతో పోలిస్తే గతవారంలో కరోనా కేసులు 55% పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. గతవారం ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర కేసులు, 43 వేల మరణాలు నమోదయ్యాయి. అందులో అత్యధికం అమెరికాలో వచ్చిన కేసులే. యూర్‌పలో కేసులు 31% పెరగ్గా.. మరణాలు 10% మేర తగ్గాయి. భారత్‌, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌లో ఒమైక్రాన్‌ కేసులు వెల్లువెత్తడంతో.. ఆగ్నేయాసియాలో కేసుల సంఖ్య 400% పెరగ్గా, మరణాలు 6% తగ్గాయి. ఆఫ్రికాలో మాత్రం కే సులు 11% తగ్గాయి. అంతకుముందువారం ప్రపంచవ్యాప్తంగా 95 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం అన్నిదేశాల్లో జీన్‌ సీక్వెన్సింగ్‌ చేసిన కేసుల్లో 59% ఒమైక్రాన్‌వేనని తేలినట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 


ఎంత వేగంగా పెరిగాయో..

దక్షిణాఫ్రికాలో నవంబరు 24న తొలిసారి ఒమైక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు! డిసెంబరు ముగిసేసరికి అక్కడ కేసులు వెల్లువెత్తడం, ఆ పొంగు చల్లారిపోవడం కూడా జరిగిపోయింది! ఇప్పుడు అదే పరిస్థితి అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో కూడా కనిపిస్తోందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఈ వారంలో కేసులు పతాకస్థాయికి చేరుతాయని, ఆ తర్వాత కేసుల తగ్గుదల మొదలవుతుందని పేర్కొన్నారు. ‘‘ఈ వేవ్‌ ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ముగిసిపోనుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లోని హెల్త్‌మెట్రిక్స్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ అలీ మొక్‌దాద్‌ తెలిపారు. ఆ వర్సిటీ అంచనాల ప్రకారం జనవరి 19 నాటికి అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య 12 లక్షలకు చేరుతుంది. ఆ సమయానికి దేశంలో దాదాపు అంతా ఒమైక్రాన్‌తో ఇన్‌ఫెక్ట్‌ అయిపోతారని మొక్‌దాద్‌ పేర్కొన్నారు. కానీ, ఇప్పటికే అమెరికాలో కేసుల సంఖ్య తగ్గుతుండడం గమనార్హం. ఇక బ్రిటన్‌లో ఈ నెల మొదట్లో 2 లక్షలకు చేరిన రోజువారీ కేసుల సంఖ్య ప్రస్తుతం 1.4 లక్షలకు తగ్గిపోయింది. మొత్తంగా చూస్తే కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. యూకేలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కూడా మెజారిటీ ప్రజలు ఇన్ఫెక్ట్‌ అయ్యాక కేసులు పూర్తిగా తగ్గుముఖం పడతాయని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.


ఏదేమైనా కరోనా మహమ్మారిని సాధారణ ఫ్లూ స్థాయికి తగ్గించే టర్నింగ్‌ పాయింట్‌ ఒమైక్రానే అనే అభిప్రాయాన్ని పలువురు శాస్త్రజ్ఞులు వ్యక్తం చేస్తున్నారు. మాటిమాటికీ కేసులు ఒక వేవ్‌లాగా పెరగడం.. ఆ తర్వాత తగ్గడం.. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు రావడం.. ముగింపులేని ప్రక్రియలాగా సాగుతున్న కరోనా తీరుతో యూర్‌పలో పలు దేశాలు విసిగిపోయాయి. దీనిని సాధారణ ఫ్లూలాగా పరిగణించి, తమ వ్యూహాలను అందుకు తగ్గట్టుగా రూపొందించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. స్పెయిన్‌ ఇప్పటికే కరోనాను ‘పాండెమిక్‌ (అంటే మహమ్మారి)’లాగా కాకుండా.. ఫ్లూ తరహాలో ఎండెమిక్‌లాగా పరిగణిస్తోంది. ముఖ్యంగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నా... ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువగా ఉండడంతో దీన్ని ఎండెమిక్‌గా పరిగణించాలని  స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే చాలా యూరప్‌ దేశాలు క్వారంటైన్‌ కాలవ్యవధిని తగ్గించేస్తున్నాయి. రష్యాలోనూ ఒమైక్రాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. కాగా.. ఈ ఏడాది మార్చిలోపు ప్రపంచవ్యాప్తంగా 60% జ నాభా ఒమైక్రాన్‌ బారినపడే అవకాశముంది. అలాగే రోజు వారీ కేసులు జనవరిలోపు 50 లక్షలకు చేరుకోనున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ మెడిసన్‌లోని ఇన్‌స్టి ట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌  పేర్కొంది. 


Updated Date - 2022-01-13T19:57:54+05:30 IST