దక్షిణాదిలో పెరుగుతున్న పాజిటివ్ రేటు
ABN , First Publish Date - 2022-01-29T08:28:17+05:30 IST
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. దక్షిణాది రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు....
2.51 లక్షల కొత్త కేసులు
దేశంలో పెరిగిన
రికవరీలు, మరణాలు
విదేశాంగ మంత్రి
జైశంకర్కు పాజిటివ్
8 2.51 లక్షల కొత్త కేసులు నమోదు
న్యూఢిల్లీ, జనవరి 28: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. దక్షిణాది రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు.. గుజరాత్, రాజస్థాన్లలోనూ పాజిటివిటీ రేటు పెరిగింది. కేరళలో ఒక్కరోజులో 51 వేల మందికి కరోనా సోకగా.. 94ు నమూనాల్లో ఒమైక్రాన్ను గుర్తించారు. శుక్రవారం ఉదయం(గడిచిన 24 గంటల్లో) 627 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 4.92 లక్షలకు చేరుకుంది. అటు దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 3.47 లక్షలుగా ఉండడం ఊరటనిచ్చే విషయమని అధికారులు తెలిపారు. కాగా.. గురువారం 57.3 లక్షల మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 164 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది. కొవిడ్ చికిత్స వనరులకు కేంద్రం ఇచ్చిన ఈసీఆర్పీ-2 నిధులను మార్చి 31లోగా వినియోగించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాలను ఆదేశించారు.
తల్లిదండ్రుల టీకా, పిల్లలకు శ్రీరామరక్ష
తల్లిదండ్రులు కొవిడ్ టీకా తీసుకుంటే.. అది పిల్లలకు శ్రీరామరక్ష అని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. హార్వర్డ్ వర్సిటీ, ఇజ్రాయెల్లోని క్లాలిట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, టెల్-ఏవివ్ యూనివర్సిటీల సంయుక్త పరిశోధనలో తల్లిదండ్రులు తీసుకునే వ్యాక్సిన్, టీకా తీసుకోని చిన్నారులనూ కాపాడుతుందని వారు పేర్కొన్నారు. ఇక.. వరుసగా నాలుగో రోజూ దేశంలో 3 లక్షల దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం(గడిచిన 24 గంటల్లో) మొత్తం 2.51 లక్షల మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ముందు రోజుతో పోలిస్తే.. పాజిటివిటీ రేటు 19.5 నుంచి 15.88శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులెటిన్ స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
బూస్టర్గా భారత్ బయోటెక్ ‘‘ముక్కు టీకా’’
కొవిడ్ నియంత్రణకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ముక్కు ద్వారా అందించే టీకా (బీబీవీ154) బూస్టర్ డోసు తుది దశ ట్రయల్స్ నిర్వహణకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులిచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ సహా దేశంలోని 9 ప్రదేశాల్లో 900 మందిపై ఈ ట్రయల్స్ చేపట్టనున్నారు.