కేసులు మళ్లీ పెరుగుతాయ్!
ABN , First Publish Date - 2021-05-14T07:43:20+05:30 IST
కరోనా సెకండ్ వేవ్తో అల్లాడుతున్న దేశం.. మరోసారి వైరస్ ఉధృతికి సిద్ధంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు. వైరస్ ముప్పును ఎదుర్కోవడానికి రాష్ట్రాల....
జాతీయస్థాయిలో సిద్ధంగా ఉండాలి
నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడి
డబుల్ మ్యుటెంట్ రకం వల్లే సెకండ్ వేవ్
ఒప్పుకొన్న కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ, మే 13: కరోనా సెకండ్ వేవ్తో అల్లాడుతున్న దేశం.. మరోసారి వైరస్ ఉధృతికి సిద్ధంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు. వైరస్ ముప్పును ఎదుర్కోవడానికి రాష్ట్రాల సమన్వయంతో జాతీయస్థాయిలో సన్నద్ధతను, మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని.. కఠిన ఆంక్షలు విధించాలని, ప్రజలందరూ నిబంధనలను పాటించాలని గురువారం ఆయన సూచించారు. సెకండ్ వేవ్ తీవ్రతను ప్రభుత్వం అంచనా వేయలేదన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ‘‘సెకండ్ వేవ్ వస్తుందని పదేపదే హెచ్చరించాం.
సీరో పాజిటివిటీ రేటు 20శాతంగా ఉంది కాబట్టి మిగతా 80 శాతం మందికి వైరస్ ముప్పుందని తెలిపాం. వైరస్ ఎక్కడికీ పోలేదని.. ఇతర దేశాలు కూడా పలు వేవ్లను చూస్తున్నాయని చెప్పాం’’ అని వీకే పాల్ గుర్తుచేశారు. సెకండ్ వేవ్ ముప్పుందని.. కలిసికట్టుగా ఎదుర్కొందామంటూ ప్రధాని మోదీ మార్చి 17న హెచ్చరించారని గుర్తుచేశారు. సెకండ్వేవ్లో ఈ స్థాయి కేసులు వస్తాయని తెలుసని, అలాగే వైరస్ మళ్లీ విజృంభిస్తుందని కూడా తెలుసని చెప్పారు. సెకండ్ వేవ్కు డబుల్ మ్యుటెంట్ (బి.1.617) కారణమని కేంద్రం ఒప్పుకొంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. బి.1.617లో కొత్త రకాలైన బి.1.617.1, బి.1.617.2 ఇంకా వేగంగా వ్యాప్తి చెందేవి, ప్రాణాంతకమైనవని డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ల ప్రభావశీలతపై ఈ కొత్త రకాల ప్రభావం గురించి ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది.