కరోనా రోగిని కొట్టిన ఆసుపత్రి సిబ్బంది..రోగి మృతి

ABN , First Publish Date - 2020-09-19T14:43:18+05:30 IST

కరోనా సోకిన ఓ రోగిని ఆసుపత్రి సిబ్బంది కొట్టిన ఘటన...

కరోనా రోగిని కొట్టిన ఆసుపత్రి సిబ్బంది..రోగి మృతి

సోషల్ మీడియాలో వీడియో వైరల్ 

రాజ్‌కోట్ (గుజరాత్): కరోనా సోకిన ఓ రోగిని ఆసుపత్రి సిబ్బంది కొట్టిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ సివిల్ ఆసుపత్రిలో జరిగింది. కరోనా రోగిన ఆసుపత్రి సిబ్బంది కొట్టిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజ్ కోట్ నగరానికి చెందిన ప్రభాకర్ పాటిల్ మూత్రపిండాల సమస్య కారణంగా 12 రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతని కిడ్నీలో నీరు చేరడంతో వైద్యులు ఆపరేషన్ చేసి నీటిని బయటకు తీశారు.అనంతరం అతను శ్వాసకోస సమస్యతో బాధ పడుతుండటంతో కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ప్రభాకర్ ను రాజ్ కోట్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా రోగి ప్రభాకర్ ను నర్సింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది కొట్టిన వీడియో వారం క్రితం వెలుగుచూసింది. 


నేలపై పడుకున్న కరోనా రోగిని పీపీఈ కిట్ ధరించిన నర్సింగ్ సిబ్బంది కొట్టారు. భద్రతా సిబ్బంది రోగిని నియంత్రించగా, మరొకరు అతనికి చెంపదెబ్బ కొట్టారు. ఈ నెల 12వతేదీన తన సోదరుడు సిబ్బంది కొట్టిన దెబ్బల వల్లే మరణించాడని మృతుడి సోదరుడు విలాస్ పాటిల్ ఆరోపించారు. కర్మాగారంలో ఆపరేటరుగా పనిచేసే ప్రభాకర్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నా సిబ్బంది అతని పట్ల కొట్టి అమానవీయంగా ప్రవర్తించారని విలాస్ పాటిల్ చెప్పారు. 

Updated Date - 2020-09-19T14:43:18+05:30 IST