Covid తీవ్రతపై ప్రధాని ఆరా
ABN , First Publish Date - 2022-01-14T18:06:12+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పదిరోజుల్లో తీవ్రమైన విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వివరించారు. ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కొవిడ్ పరిస్థితిపై గురువారం
- నియంత్రణ చర్యలను వివరించిన CM
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు పదిరోజుల్లో తీవ్రమైన విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వివరించారు. ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కొవిడ్ పరిస్థితిపై గురువారం వర్చువల్ రూపంలో సమీక్ష చేశారు. కొవిడ్ పాజిటివ్తో హోం ఐసొలేషన్లో గడుపుతున్న సీఎం బొమ్మై ఆర్టీనగర్ నివాసం నుంచి పాల్గొన్నారు. డిసెంబరు చివరి దాకా కరోనా నియంత్రణలోనే ఉండేదని పలు కారణాలతో పాజిటివిటీ రేటు 1 నుంచి 15 శాతం దాకా పెరిగిందని ప్రధానికి వివరించారు. కొవిడ్ నియంత్రణ కోసం నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ, బెంగళూరులో విద్యాసంస్థల మూసివేత, హోటల్, మాల్స్, సినిమాహాల్లో 50 శాతంమందికి అవకాశం వంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు. జనవరి నెలాఖరు దాకా నిబంధనలు పొడిగించామని, ప్రత్యేకించి ఆరేడు జిల్లాల్లో కేసులు తీవ్రమవుతున్నందున అక్కడ మరిన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించామని ప్రధానికి వివరించారు.
మల్లికార్జున ఖర్గేకు కొవిడ్ పాజిటివ్
కొవిడ్ తీవ్రమవుతున్నా లెక్క చేయకుండా మేకెదాటు పాదయాత్రలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ నేతలకు కరోనా వైరస్ సోకింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. రెండు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా గురువారం పాజిటివ్గా తేలింది. బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో హోం ఐసొలేషన్లో గడుపుతున్నారు. కాగా మాజీ మంత్రులు హెచ్ఎం రేవణ్ణ, ఇబ్రహీంలకు ఇప్పటికే కొవిడ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.