కొవిడ్ దూకుడు
ABN , First Publish Date - 2021-04-16T06:08:28+05:30 IST
కొవిడ్ కేసుల్లో దూకుడు పెరిగింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి. కొవిడ్ బాధితులు పెద్దసంఖ్యలో పెరుగుతున్నారు.
- బాధితులతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి కిటకిట
- ఇప్పటికే 175 మందికి పైగా ఇన్పేషెంట్లకు చికిత్స
- ప్రభుత్వాసుపత్రి అధికారిక సామర్థ్యం 250 బెడ్స్ మాత్రమే
- అప్రమత్తమవుతున్న ఆసుపత్రి యంత్రాంగం
రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 15: కొవిడ్ కేసుల్లో దూకుడు పెరిగింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి. కొవిడ్ బాధితులు పెద్దసంఖ్యలో పెరుగుతున్నారు. జిల్లాలో ఎక్కడా కొవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి లేకపోవడంతో వైరస్బారిన పడిన చాలా మంది ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం 175 మందికి పైగా బాధితులు ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్థమవుతోంది. ఒకటి, రెండు రోజుల్లో బాధితుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రి 250 బెడ్స్ సామర్థ్యం మాత్రమే కల్గి ఉంది. కేసుల పెరుగుదల ఇలానే ఉంటే ఒకటి, రెండు రోజుల్లోనే బెడ్స్ మొత్తం నిండిపోయే అవకాశం ఉంది. ఎంసీహెచ్ బ్లాకు (పురుళ్లవార్డు)లో 100 బెడ్స్ సామ ర్థ్యమున్నా అక్కడ కొవిడ్ కేసులకు చికిత్స చేసే అవకాశం లేదు. కేవలం డెలివరీలకు మాత్రమే ఈ బ్లాకును పరిమితం చేశారు. దీంతో కోవిడ్ బాధితులు పెరిగినా పాత బిల్డింగ్లోనే సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు వైద్యాధికారులను కలవరపెడుతోంది. బెడ్స్ లేకపోవడంతోపాటు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా సమస్యగా మారుతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
- కొవిడ్ వైద్యులు, స్టాఫ్ నర్సులకు పిలుపు..
కొవిడ్ బాధితులకు వైద్యసేవలు అందించడం కోసం గత ఏడాది 6 నెలల కాల పరిమితితో నియమించి, ఈ ఏడాది జనవరిలో తొలగించిన తాత్కాలిక వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి గురువారం నుంచి మళ్లీ ఫోన్కాల్స్ వస్తున్నాయి. వెంటనే విధుల్లో చేరాలంటూ కాకినాడలోని వికాస అవుట్సోర్సింగ్ సంస్థ నుంచి గతంలో పనిచేసిన కొందరు వైద్యులు, స్టాఫ్నర్సులకు ఫోన్లు వెళ్లాయి. ఎఫ్ఎన్వోలు, ఎంఎన్వోలకు ఇంకా ఫోన్లు రాలేదు. అయితే వీరిని ఇప్పుడు 3 నెలల కాలానికి మాత్రమే తీసుకుంటున్నారని సమాచారం. దీంతో కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది విధుల్లో చేర తారనేది సందేహంగా మారింది.
- ఆందోళనకరంగా కొవిడ్ కేసులు: సూపరింటెండెంట్
కొవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సోమసుందరరావు అన్నారు. ఆసుపత్రి సామర్థ్యం 250 బెడ్స్ అయినా 350 మంది వరకూ వైద్యసేవలు అందజేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.