తమిళనాడులో ఈ నెల 6 నుంచి రాత్రి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-05T22:35:09+05:30 IST

కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడులో ఈ నెల 6 నుంచి రాత్రి కర్ఫ్యూ

చెన్నై : కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 6 గురువారం నుంచి రాత్రి సమయంలో కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆదివారాల్లో పూర్తిగా అష్ట దిగ్బంధనం విధించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈ వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. కోవిడ్ ఆంక్షలను పెంచాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయించారని  తెలిపారు. 


మంగళవారం తమిళనాడులో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,731కి చేరింది. ముఖ్యంగా చెన్నై కోవిడ్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. తొమ్మిది మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 


ప్రజా రవాణా వాహనాలను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడిపేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే సంక్రాంతి పండుగ సంబరాలను వాయిదా వేసింది. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనా స్థలాలను మూసివేస్తారు. అమ్యూజ్‌మెంట్ పార్కులను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 


అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్ళేవారు తమ సొంత రవాణా సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. 


తమిళనాడు శాసన సభలో గవర్నర్ ఆర్ఎన్ రవి బుధవారం మాట్లాడుతూ, కోవిడ్-19 రూపాంతరం ఒమైక్రాన్‌ విసిరే సవాలును ఎదుర్కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే బహిష్కరించింది. 


ఇదిలావుండగా కోవిడ్-19 మహమ్మారి తీవ్రత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్‌లలో కూడా కనిపిస్తోంది. 


Updated Date - 2022-01-05T22:35:09+05:30 IST