కొవిడ్ నివారణకు చర్యలు
ABN , First Publish Date - 2020-11-28T06:33:40+05:30 IST
కొవిడ్ నివారణకు చర్యలు
ఆయుర్వేద వైద్యులకు శిక్షణలో ఆయుష్ కమిషనర్ ఉషారాణి
విజయవాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : అల్లోపతి, ఆయుష్ సమన్వయంతో కొవిడ్ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయుష్ కమిషనర్ పి.ఉషారాణి చెప్పారు. నగరంలోని సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో శుక్రవారం ఆయుష్ డాక్టర్లకు నిర్వహించిన పోస్ట్ కొవిడ్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ నివారణకు రాష్ట్రవ్యాప్తంగా 400 మంది ఆయుష్ వైద్యులు అందించిన ముందస్తు చికిత్సా పద్ధతులు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. గుడివాడలో ప్రయోగాత్మకంగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఆయుర్వేద కొవిడ్ మందులు వాడిన వారికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయినట్లు ఆమె తెలిపారు. దీంతో మారుమూల గామ్రాల్లో సుమారు 4 లక్షల మందికి ఆయుర్వేద కొవిడ్ నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. పోస్ట్ కోవిడ్ చికిత్సపై నిపుణులైన న్యూరో, ఫిజియోథెరపీ, కొవిడ్ వైద్యనిపుణులతో ఆయుర్వేద వైద్యులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ అడిషనల్ డైరెక్టర్ సాంబమూర్తి, రీజనల్ జాయింట్ డైరెక్టర్లు కేవీ రమణ, శేఖర్, ఆయుష్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సాయిసుధాకర్, ఫిజియోథెరపీ వైద్యనిపుణుడు వోలాస్, న్యూరో వైద్యనిపుణుడు పవన్కుమార్, కొవిడ్ వైద్యనిపుణురాలు శిరీష, ఇతర వైద్యులు పాల్గొన్నారు.