ఈనెల 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ
ABN , First Publish Date - 2021-01-15T02:06:58+05:30 IST
ఈనెల 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆన్లైన్ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ఢిల్లీ: ఈనెల 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆన్లైన్ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి ప్రభుత్వం వ్యాక్సిన్లు ఇవ్వనుంది. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తారు. కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలించనున్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అధికారులు పర్యవేక్షిస్తారు. నిరంతర ప్రక్రియకు ప్రత్యేక కాల్సెంటర్ను కేంద్రం ఏర్పాటు చేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమంలో తొలి అంకం వేగంగా సాగుతోంది. దేశం నలుమూలలకూ టీకాల సరఫరా జోరందుకుంది. తొలిరోజు పెద్ద నగరాలకు టీకాలు తరలించగా.. రెండోరోజైన బుధవారం చిన్న నగరాలకు, పట్టణాలకు వ్యాక్సిన్లు చేరాయి. ఇప్పటిదాకా 56 లక్షల కొవిషీల్డ్ టీకాలు 13 నగరాలకు తరలగా.. కొవాగ్జిన్ టీకాలు 11 నగరాలకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి సీరం ఇన్స్టిట్యూట్ అందుకున్న 1.1 కోట్ల డోసుల ఆర్డర్లో 95 శాతం మేర సరఫరా అయినట్టు సమాచారం. మిగిలిన లక్ష డోసుల టీకాను త్వరలోనే పంపనున్నారు. ఇక.. ప్రభుత్వం నుంచి 55 లక్షల డోసులకు ఆర్డర్ అందుకున్నామని.. తొలి బ్యాచ్ టీకాలను సరఫరా చేశామని భారత్ బయోటెక్ సంస్థ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.