రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందే
ABN , First Publish Date - 2020-12-04T05:42:54+05:30 IST
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు మోదీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్
గుంటూరు(సంగడిగుంట) డిసెంబరు 3 : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు మోదీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా గుంటూరు శంకర్విలాస్ సెంటర్లో గురువారం వామపక్ష పార్టీలు, రైతు, ప్రజా సంఘాలు చేపట్టిన రాస్తారోకో చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరనే విషయాన్ని కేంద్రంలోని నరేంద్రమోదీ, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. నాయకులు తూమాటి శివయ్య, నాగేశ్వరరావు, గనిరాజు, రవి, కొల్లి రంగారెడ్డి, విఠల్రెడ్డి, వేల్పూరి నరసింహారావు, అమీర్వలి, ఆకిటి రామచంద్రుడు, జంగాల చైతన్య, ఎన్వీ కృష్ణ, రెడ్డి శ్రీను, కాలువ శ్రీధర్లను అరెస్టు చేసి అరండల్పేట స్టేషన్కు, ఆకిటి అరుణ్కుమార్, చల్లా మరియదాసు, జగన్నాథం, కోటేశ్వరరావు, గోపిలను నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు.
సీపీఎం ఆధ్వర్యంలో..
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సీపీఎం కార్యాలయం నుంచి ఆ పార్టీ నాయకులు శంకర్విలాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టాభిపురం, నల్లపాడు, అరండల్పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలు రైతులను సంక్షోభంలోకి తీసుకెళుతున్నాయన్నారు. పొమ్మనలేక పొగబెట్టిన చందంగా రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసే విధంగా కొత్త చట్టాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నేతాజి, అజయ్కుమార్, పాపారావు, శ్రీనివాసరావు, శ్రీనివాస్, ఆది నికల్సన్, అరుణ, లక్ష్మణ్రావు, కిరణ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.