జగన్ను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: Narayana
ABN , First Publish Date - 2021-09-01T18:23:05+05:30 IST
తెలంగాణాలో షర్మిల పార్టీ ఏర్పాటుతో కవలలుగా ఉన్న కేసీఆర్, జగన్ల మధ్య జల వివాదం జఠిలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
ప్రకాశం: తెలంగాణాలో షర్మిల పార్టీ ఏర్పాటుతో కవలలుగా ఉన్న కేసీఆర్, జగన్ల మధ్య జల వివాదం జఠిలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను అడ్డం పెట్టుకుని జగన్ను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు రాజకీయ పరిష్కారం తప్ప ఏ కోర్టులు పరిష్కరించ లేవని స్పష్టం చేశారు. కృష్ణా జలాల వివాదం వెలుగొండ ప్రాజెక్టుపై కూడా పడటంతో పలు సమస్యలు తీవ్రతరం అయ్యాయన్నారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతున్నారని.. అలాంటప్పుడు ఈ రాజ్యాంగ వ్యవస్థ మొత్తం ఎందుకు అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్ధకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్చేశారు.
మంత్రి బొత్స రాజధాని విషమంలో ఓ వర్గం వారితో మాట్లాడేదేమిటని అంటున్నారని... విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఎంట్రీతో బొత్స ఉత్సవ విగ్రహంలా మారారని యెద్దేవా చేశారు. రాజధాని విషయంలో అసంబద్ధ వైఖరిని ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. ఎంత దద్దమ్మ ముఖ్యమంత్రి అయినా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని హితవుపలికారు. పోలవరం నుండి వెలుగొండ ప్రాజెక్టు వరకూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయకపోవటం వల్ల ప్రాజెక్టుల వల్ల ఉపమోగం లేకుండా పోతుందన్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకని ఖజానా నింపుకోవాలని చూడటం సరైనది కాదని నారాయణ అన్నారు.