బస్సులు నడపకపోవడం ఇరువురు సీఎంల శాడిజానికి పరాకాష్ట: రామకృష్ణ
ABN , First Publish Date - 2020-10-21T13:13:27+05:30 IST
వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీ బస్సులు కూడా నడపక పోవటం ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల శాడిజానికి పరాకాష్ట కాదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు
అమరావతి: వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆర్టీసీ బస్సులు కూడా నడపక పోవటం ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల శాడిజానికి పరాకాష్ట కాదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. పండుగ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య ఈ దసరా పండుగ నుంచైనా ఆర్టీసీ బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. రైళ్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తెలంగాణ, ఏపీల మధ్య రాకపోకలకై ఆర్టీసీ బస్సులే ఆధారమన్నారు. హైదరాబాద్ వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇబ్బడిముబ్బడిగా చార్జీలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. పండుగల సందర్భంగా తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ఏపీలోని స్వస్థలాలకు రావాలనుకున్న వారికి నిరాశ ఎదురవుతోందని రామకృష్ణ అన్నారు.