బిగ్‌బాస్‌.. ఓ బ్రోతల్‌ స్వర్గం

ABN , First Publish Date - 2021-09-15T08:16:44+05:30 IST

‘బిగ్‌బాస్‌’ కార్యక్రమం ఓ బ్రోతల్‌ స్వర్గమని, రెడ్‌లైట్‌ సంస్కృతిలాంటిదని...

బిగ్‌బాస్‌.. ఓ బ్రోతల్‌ స్వర్గం

  • 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం చేయగలరా?
  • ఏపీలో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల బుకింగ్‌ నిర్ణయం మంచిదే: సీపీఐ నారాయణ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమం ఓ బ్రోతల్‌ స్వర్గమని, రెడ్‌లైట్‌ సంస్కృతిలాంటిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని మరోసారి కోర్టుకు వెళతానని ప్రకటించారు. మంగళవారం ముక్దూం భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో యువతీయువకులను 105 రోజులు ఒకే గదిలో పెడుతున్నారన్నారు. లోపల ముద్దులు పెట్టుకుంటున్నారని, డేటింగ్‌ చేయిస్తున్నారని, ఇది సాంస్కృతి క దోపిడీ అని ఆరోపించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారని నిలదీశారు. ఆ కార్యక్రమాన్ని 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం చేయగలరా? అని సవాల్‌ విసిరారు. కాగా, హైకోర్టు సూచన ను పాటిస్తూ ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం చేయవద్దని నారాయణ అన్నారు.


సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం చెప్పడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్ల బుకింగ్‌ను అమ లు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా గుర్తించిన తర్వాతే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్రంలో అడుగుపెట్టాలని నారాయణ డిమాండ్‌ చేశారు. ఎంఐఎం బ్లాక్‌మెయిలింగ్‌ పార్టీ అని, ఆ పార్టీకి సీఎం కేసీఆర్‌ లొంగిపోయారని దుయ్యబట్టారు. ఈ నెల 17న విలీన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపకపోతే టీఆర్‌ఎస్‌ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని నారాయణ అన్నారు. పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే పార్లమెంటు పరువుపోతుందని నారాయణ వ్యాఖ్యానించారు. అదే జరిగితే ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు. 

Updated Date - 2021-09-15T08:16:44+05:30 IST