కూచ్ బేహార్ కాల్పులపై ఉన్నత స్థాయి విచారణకు సీపీఎం డిమాండ్

ABN , First Publish Date - 2021-04-11T01:00:58+05:30 IST

పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది...

కూచ్ బేహార్ కాల్పులపై ఉన్నత స్థాయి విచారణకు సీపీఎం డిమాండ్

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఇవాళ ఉదయం కూచ్ బేహార్ జిల్లా సీతల్‌కూచి ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ జరుగుతున్న నాలుగో విడత పోలింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. స్థానికులు మూకుమ్మడిగా దాడి చేసి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారంటూ పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విటర్లో స్పందిస్తూ... ‘‘కేంద్ర బలగాలు ఓటర్లపై కాల్పులు జరిపి నలుగురిని చంపడం దారుణం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరిపించి, దోషులను శిక్షించాలి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం..’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-11T01:00:58+05:30 IST