పోడు భూములపై ఇచ్చిన జీవోలో మార్పులు చేయాలి: బృందా కారత్

ABN , First Publish Date - 2021-11-11T17:50:07+05:30 IST

పోడు భూముల విషయంలో ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే విడుదల చేసినటువంటి జీవోలో తక్షణమే మార్పులు చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ డిమాండ్ చేశారు.

పోడు భూములపై ఇచ్చిన జీవోలో మార్పులు చేయాలి: బృందా కారత్

భద్రాద్రి కొత్తగూడెం: పోడు భూముల విషయంలో ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే విడుదల చేసినటువంటి జీవోలో తక్షణమే మార్పులు చేయాలని  సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ డిమాండ్ చేశారు.  ఇది రైతులకు నష్టదాయకమైన జీవో అని అన్నారు. ఏజెన్సీ చట్టాలకు చట్టబద్ధమైన హక్కును నిరాకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తెలిపారు. సర్కులర్ పేరుతో రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని... ప్రస్తుతం దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాక రైతులను వరి పంట వేయవద్దని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసింది రైతుల భవిష్యత్తు కోసమా కాంట్రాక్టర్ల లాభాల కోసమా అని నిలదీశారు. తమకు బీజేపీ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని అడిగారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, ప్రకటనలు ఇస్తారని మండిపడ్డారు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిలకడగా నిబద్ధతగా ప్రత్యామ్నాయ విధానాలతో  పోరాటం చేస్తే తాము తప్పకుండా సహకరిస్తామని బృందా కారత్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-11T17:50:07+05:30 IST