సీపీఎం కార్యాలయాలకు నిప్పు.. బీజేపీనే కారణమంటున్న లెఫ్ట్
ABN , First Publish Date - 2021-09-09T01:21:31+05:30 IST
తమ పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టింది భారతీయ జనతా పార్టీ నేతలేనని సీపీఎం ఆరోపించింది. తాజాగా సీపీఎంతో వచ్చిన తగువుల కారణంగా అగర్తలలో బీజేపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టిందని
అగర్తల: త్రిపుర రాజధాని అగర్తలలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో పాటు మరో కార్యాలయానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం నిప్పు పెట్టారు. రాజధాని అగర్తలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన, ఆందోళన తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. దీన్ని అదనుగా చూసుకొనే కొంత మంది నిప్పు పెట్టారట. సీపీఎం ప్రధాన కార్యాలయం భాను స్మృతి భవన్తో పాటు దశరథ్ భవన్ నిప్పుల్లో చిక్కుకున్నాయి. ఈ భవనాల వద్ద ఉన్న పవు వాహనాలు కూడా నిప్పుల్లో చిక్కుకున్నాయి.
కాగా, తమ పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టింది భారతీయ జనతా పార్టీ నేతలేనని సీపీఎం ఆరోపించింది. తాజాగా సీపీఎంతో వచ్చిన తగువుల కారణంగా అగర్తలలో బీజేపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టిందని, జిల్లాల్లో కూడా అనేక నిరసనలు కొనసాగుతున్నాయని, అందులో భాగంగానే తమ కార్యాలయాలకు నిప్పు పెట్టినట్లు వారు పేర్కొన్నారు. అయితే సీపీఎం కార్యాలయాల్లో బాంబులు ఉన్నాయని, అవి పేలడంతో నిప్పు చెలరేగిందని బీజేపీ చెప్పుకొచ్చింది.