పన్నులు పెంచొద్దంటే అరెస్టు చేస్తారా?
ABN , First Publish Date - 2021-07-30T05:27:00+05:30 IST
పన్నులు పెంచొద్దంటే అరెస్టు చేస్తారా?
ప్రభుత్వంపై సీపీఎం నేతల మండిపాటు
జీజీహెచ్లో సత్యబాబు దీక్ష విరమణ
విజయవాడ, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో పరిపాలన సాగిస్తోం దంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు వేయడం దుర్మార్గమంటూ కార్పొరేషన్ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టిన సీపీఎం ఫ్లోర్లీడర్ బోయి సత్యబాబును పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడాన్ని వారు ఖండించారు. ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్న సత్యబాబును గురువారం పరామర్శించిన మధు, బాబూరావు ఆయనకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్నుల పెంపును నిరసిస్తూ శుక్రవారం ధర్నాచౌక్లో నిరసన చేపట్టామని, అన్ని పార్టీలు, సంఘాలతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అంతకుముందు టీడీపీ కార్పొరేటర్లు బాలస్వామి, సాంబశివరావు, సాయిప్రసాద్, దేవినేని అపర్ణ, చెన్నుపాటి గాంధీ, రామ్మోహన్రావు, సీపీఐ నాయకులు దోనేపూడి శంకర్, కేవీ భాస్కరరావు, కాంగ్రెస్ నాయకుడు నరహరిశెట్టి నరసింహారావు, సీపీఎం నేతలు దోనేపూడి కాశీనాథ్, డీవీ కృష్ణ, బి.రమణరావు, బి.నాగేశ్వ రరావు, కె.దుర్గారావు సత్యబాబును పరామర్శించారు.